బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవల రాష్ట్రవ్యాప్త బంద్ జరిగింది. ఆ బంద్ జయప్రదమైంది. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు, ఆ సంఘం ఈ సంఘం అని లేకుండా అన్ని సంఘాలు బీసీల ఆందోళనలకు మద్దతిచ్చాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తోపాటు ఎంఐఎం, బీజేపీ, సీపీఐ మద్దతిచ్చాయి. ఆ బిల్లును ప్రభుత్వం గవర్నర్కు పంపింది. దాన్ని ఆయన పక్కకుపెట్టటం, ఆ తర్వాత బీసీ రిజర్వేషన్లపై కొందరు కోర్టుకెళ్లటంతో ప్రస్తుతం అది న్యాయస్థానం పరిధిలోకి వెళ్లింది. ఈ క్రమంలో ‘బీసీలకు న్యాయం చేయాల్సిందే.. వారికి స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే…’ అంటూ అందరూ ముక్తకంఠంతో నినదించారు.
ఆ కోవలోనే బీసీ బంద్ను నిర్వహించారు. ఇదంతా బాగానే ఉందిగానీ… బీసీ బిల్లుకు రాష్ట్రంలో మద్దతిచ్చి.. కేంద్రంలో అడ్డుకుంటున్న బీజేపీ నేతలు కూడా ఈ బంద్లో పాల్గొనటం విచిత్రం. అంతేకాదు… ‘బీసీ బిల్లును అడ్డుకుంటే అంతుచూస్తాం.. రాష్ట్రాన్ని మా ఆందోళనలతో హోరెత్తిస్తాం…’ అంటూ ఆ పార్టీ నాయకులు గర్జించటం గమనార్హం. బిల్లును పార్లమెంటులో ఆమోదించకుండా తొక్కిపట్టేదీ ఆ పార్టీయే.. ఆందోళనల్లో అందరికంటే ముందుగా నినాదాలిచ్చేది ఆ పార్టీ నేతలే. వాళ్ల మాటలను ఉటంకిస్తూ ఓ సీనియర్ లీడర్…’కమలం పార్టీ నేతల చేష్టలు చూస్తుంటే హత్య చేసిన హంతకుడే, తిరిగి ఆ శవానికి నివాళులర్పించినట్టుగా ఉంది…’ అంటూ వ్యాఖ్యానించారు.
బి.వి.యన్.పద్మరాజు
హంతకుడు-నివాళి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


