నవతెలంగాణ-హైదరాబాద్ : అంతరిక్షంలో ఓ గ్రహశకలం చంద్రుడి వైపు దూసుకెళుతోందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దాదాపు 15 అంతస్తుల భవన పరిమాణంలో ఈ గ్రహశకలం ఢీ కొడితే చంద్రుడి ఉపరితలంపై 800 అడుగుల మేర భారీ గుంత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావం భూమిపైనా పడుతుందని అంచనా వేశారు. నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలీస్కోప్ గుర్తించిన ఈ గ్రహశకలాన్ని 2024 వైఆర్4 గా వ్యవహరిస్తున్నారు. ఇది 2032 చంద్రుడిని తాకనుందని చెబుతున్నారు. అయితే, ఈ గ్రహశకలం చంద్రుడిని ఢీ కొట్టే అవకాశం స్వల్పంగానే ఉందని వివరించారు.
2024 వైఆర్4 గ్రహశకలం చంద్రుడిని ఢీ కొడితే భారీ విస్పోటనం ఏర్పడుతుందని, గ్రహశకలం ముక్కలైపోతుందని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ గ్రహశకలం ముక్కలు భూమివైపు వస్తాయని, వాటివల్ల భూ కక్ష్యలో తిరగుతున్న ఉపగ్రహాలకు ముప్పు పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కటీ ఒక్కో మీటర్ పరిమాణంలో ఉండే ఈ గ్రహశకలం ముక్కలు కనుక ఢీ కొడితే ఉపగ్రహాలు దెబ్బతింటాయని తెలిపారు.
ప్రస్తుతం భూమి చుట్టూ సుమారు 10 వేలకు పైగా యాక్టివ్ ఉపగ్రహాలు తిరుగుతున్నాయని, మరో 25 వేల వరకు అంతరిక్ష వ్యర్థాలు ఉన్నాయని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే, 2024 వైఆర్4 గ్రహశకలం చంద్రుడిని ఢీ కొట్టే అవకాశం స్వల్పంగానే ఉండడంతో ముప్పు ఉండకపోవచ్చని వివరించారు.