– రోగి భార్యతో వార్డుబారు అసభ్యకర ప్రవర్తన
– చితకబాది పోలీసులకు అప్పగించిన సహాయకులు
నవతెలంగాణ – ముషీరాబాద్
హైదరాబాద్ నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలోని దుర్గాబాయి దేశ్ముఖ్ ఆస్పత్రిలో దారుణ ఘటన జరిగింది. వైద్యం కోసం ఆస్పత్రిలో చేరిన ఓ రోగి భార్య పట్ల వార్డుబారు అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఇతర రోగుల అటెండర్లు ఆ ప్రబుద్ధ్దున్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్లో నివాసముంటున్న ఓ వ్యక్తి డెయిరీ ఫాం నిర్వహిస్తున్నాడు. అతనికి ఇటీవల హైబీపీ రావడంతో విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు పరీక్షించి ఐసీయూలో పెట్టి చికిత్స చేశారు. రెండ్రోజుల తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో ఆదివారం జనరల్ వార్డులోని షేరింగ్ రూమ్కు మార్చారు. అతనికి సహాయంగా భార్య ఉంటున్నది. కాగా, సోమవారం తెల్లవారుజామున ఉదయం 3.30 గంటల సమయంలో జనరల్ వార్డులో నైట్ డ్యూటీ విధుల్లో ఉన్న వార్డు బారు(రాంనగర్ నివాసి) సీతారాం రోగి బెడ్షీట్ మార్చుతానని షేరింగ్ రూంలోకి వచ్చాడు. రోగి నిద్రపోతుండటాన్ని గమనించి గది తలుపుకు గడియ పెట్టాడు. రోగి భార్య చేయి పట్టుకొని అసభ్యకరంగా ప్రవర్తించాడు. దాంతో ఆమె కేకలు పెట్టడంతో తోటి రోగుల సహాయకులు నిద్ర లేచి సీతారాంను పట్టుకొని చితకబాదారు. అనంతరం నల్లకుంట పోలీసులకు సమాచారం అందించి అప్పగించారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందడంతో ఓయూ ఏసీపీ జగన్, నల్లకుంట సీఐ జగదీశ్వర్ రావు, ఎస్ఐ లక్ష్మీనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. షేషెంట్ల సహాయకులతో మాట్లాడి వివరాలు సేకరించారు. నిందితుడు సీతారాంపై బీఎన్ఎస్ 74, 75, 78 నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దుర్గాబాయి దేశ్ముఖ్ ఆస్పత్రిలో దారుణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES