నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో ఇద్దరు నిందితులకు ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్లతో కూడిన ధర్మాసనం నిందితులు రూ.50,000 చొప్పున బెయిల్ బాండ్, పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. బెయిల్ షరతుల్లో భాగంగా నిందితులు ఢిల్లీ విడిచి వెళ్లకూడదని, ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఇంటర్వ్యూలు, బహిరంగ ప్రకటనలు చేయకూడదని ఆదేశించింది. తమ బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిందితులు సవాలు చేశారు.

2023 డిసెంబర్ 13న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నిందితులు సాగర్శర్మ, డి. మనోరంజన్లు జీరో అవర్ సమయంలో పబ్లిక్ గ్యాలరీ నుండి లోక్సభ చాంబర్లోకి దూకిన సంగతి తెలిసిందే. పసుపు రంగుతో కూడిన పొగను విడుదల చేస్తూ, నినాదాలు చేశారు. అనంతరం కొంతమంది ఎంపిలు వారిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో మరో ఇద్దరు నిందితులు అమోల్ షిండే, ఆజాద్లు పార్లమెంట్ ప్రాంగణం వెలుపల ఆందోళన చేపట్టారు. ‘నియంతృత్వం పనిచేయదు’ అని నినాదాలు చేస్తూ పసుపురంగు పొగను విడుదల చేశారు. నలుగురిని వెంటనే అరెస్ట్ చేయగా, లలిత్ ఝా, మహేశ్ కుమావత్లను తర్వాత అదుపులోకి తీసుకున్నారు.