నవతెలంగాణ-హైదరాబాద్: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమానాల రద్దు కొనసాగుతోన్న వేళ …. ఎయిర్పోర్టులో ప్రయాణీకులు తీవ్ర అవస్థలుపడుతున్నారు. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలతో వరుసగా మూడో రోజు కూడా పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. శుక్రవారం మొత్తం 500కుపైగా విమానాలను సంస్థ రద్దు చేసింది. దీంతో ఎయిర్పోర్టుల్లో ఇండిగో ప్రయాణికులు అసహనానికి గురవుతున్నారు. బోర్డింగ్ ప్రక్రియ ముగిసి 12 గంటలయ్యిందని తాము వెళ్లాల్సిన విమానానికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇంతవరకూ లేదని ప్రయాణీకులు ఆందోళలనకు దిగుతున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాముల నిరసనతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. హైదరాబాద్ నుంచి కొచ్చికి వెళ్లాల్సిన విమానం 12 గంటలపాటు ఆలస్యం కావడంతో అయ్యప్పలు ఆందోళనకు దిగారు. ఇండిగో విమానం గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సి ఉంది. ఈ విమానంలో వెళ్లాల్సిన అయ్యప్పలు సాయంత్రమే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
అయితే, విమానం శుక్రవారం ఉదయానికి కూడా బయలుదేరకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. బోర్డింగ్ గేటుకు అడ్డంగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 12 గంటలుగా తాము విమానాశ్రయంలోనే ఉన్నామని, విమానం గురించి తమకు సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదని ఆసహనం వ్యక్తం చేశారు. ఇండిగో విమానాల రద్దు కారణంగా గత రెండు, మూడు రోజులుగా ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.



