– గోదావరిలో ఒక్క చుక్క నీటిని వదులుకోం
– కేంద్రం వద్ద అవే వాదనలు వినిపిస్తాం
– రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని చర్యలు
– కోర్టు తీర్పు ప్రకారం స్థానిక ఎన్నికలు
– చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు త్రిబుల్ఆర్్కు ఆమోదం
– తెలంగాణ స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం
– క్రీడా రిజర్వేషన్లు, పారితోషికాలు పెంపు
– కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు
– కాళేశ్వరం కమిషన్కు మినిట్స్తో కూడిన సమాచారం
– రాష్ట్రవ్యాప్తంగా రైతుభరోసా విజయోత్సవాలు : మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
”గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో వెనక్కి తగ్గం. చట్టబద్దంగా రాష్ట్రానికి రావాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా వదిలిపెట్టం. ఈ మేరకు జులై మొదటి వారంలో కేంద్రం వద్ద జరిగే చర్చల్లో బలమైన వాదనలు వినిపించాలి” అని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయిం చింది. అలాగే కాళేశ్వరం అవినీతిపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అడిగిన సమాచారాన్ని నిర్దేశిత గడువులోగా అందించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి అధ్యక్షతన సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి మీడియాకు వివరించారు. గత బీఆర్ఎస్ సర్కార్ 2016లో అపెక్స్ కమిటీలో 400 టీఎంసీలను లిఫ్ట్ చేయడానికి ఏపీకి అనుమతి ఇచ్చిందనీ, వాస్తవాలను పక్కన పెట్టి బనకచర్ల బంకను తమ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రులు చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో చట్టపరంగా, న్యాయపరంగా ముందుకెళ్లాలని మంత్రివర్గం నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్పై ఈనెల 30లోపు కమిషన్కు మినిట్స్తో సహా పూర్తి వివరాలు ఇవ్వాలని నిర్ణయించారు. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా నూతన క్రీడా పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్రీడా కోటాలో రిజర్వేషన్లు పెంచాలని, క్రీడాకారులను ప్రోత్సహించేలా పారితోషికాలు ఇవ్వాలని నిర్ణయించారు. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201కి.మీ., మేర త్రిబుల్ ఆర్ నిర్మాణానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంగళవారం నాటికి రైతులందరికీ రైతుభరోసా పూర్తవుతుందనీ, 9 రోజుల్లో రూ. 9 వేల కోట్ల మొత్తాన్ని రైతులకు అందజేశామని మంత్రులు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్గాంధీ విగ్రహం వద్ద రైతుల సమక్షంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రులు తెలిపారు. అలాగే అన్ని మండల కేంద్రాల్లోనూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బనకచర్లపై చర్చలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని ఆహ్వానించాలనే అంశం మంత్రివర్గంలో ప్రస్తావనకు రాలేదని సమాచారం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను నవంబర్ 9న ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించేందుకు గతంలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో రెండు కమిటీలను ఏర్పాటు చేశారనీ, ప్రస్తుతం ఆ కమిటీల స్థాయిలో చర్చలు జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే ప్రతి నెలా రెండు సార్లు మంత్రివర్గ సమావేశం జరపాలని తీర్మానించారు. కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత విజన్ 2047 కు అనుగుణంగా రాష్ట్రం ప్రభుత్వం తన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలనీ, దానికోసం సలహా మండలి ఏర్పాటు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. డిసెంబరు 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీని ఆవిష్కరించాలని నిర్ణయించారు. మహబూబ్నగర్లో బాసర త్రిబుల్ఐటీ క్యాంపస్ ఏర్పాటు, హుస్నాబాద్లో శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు వివరించారు. క్యాన్సర్పై అవగాహన కోసం ఆ రంగంలో ప్రముఖ వైద్యులు నోరి దత్తాత్రేయుడిని సలహాదారుగా నియమించాలని నిర్ణయించారు. సంగారెడ్డి జిల్లాలో రెండు కొత్త మున్సిపాల్టీలు ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ అప్గ్రేడ్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల అంశం కోర్టు పరిధిలో ఉందనీ, కోర్టు తీర్పు ప్రకారం నడుచుంటామని తెలిపారు.
బనకచర్లపై వెనక్కితగ్గం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES