Saturday, June 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబీసీ గురుకులాల అద్దె బకాయిలు విడుదల

బీసీ గురుకులాల అద్దె బకాయిలు విడుదల

- Advertisement -

– విద్యార్థుల ఖాతాల్లోకి కాస్మోటిక్‌ చార్జీలు
– నాణ్యమైన విద్య, ఆహారం, వసతి : బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

బీసీ గురుకులాల అద్దె బకాయిలు విడుదల చేసినట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరం గురువారం నుంచి పునఃప్రారంభమైన నేపథ్యంలో అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు కాస్మోటిక్‌ చార్జీలు నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్‌లో జమయ్యేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. విద్యార్థులందరికీ బ్యాంక్‌ అకౌంట్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారికి నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, వసతి సదుపాయాలు కల్పించాలని అన్నారు. అదే విధంగా పేద, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనలో, విద్యాబోధనలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందనీ, ప్రిన్సిపాల్లు, హాస్టల్‌ వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ విద్యార్థుల భవితవ్యం కోసం శాయశక్తుల కృషి చేయాలన్నారు. రాష్ట్రం, దేశం గర్వపడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. రేపటి భవిష్యత్‌ నేటి విద్యార్థులపైనే ఆధారపడి ఉందనీ, బీసీ సంక్షేమ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేలా శ్రద్ద తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల అద్దె బకాయిలు విడుదల చేసిందని చెప్పారు. భవనాల యజమానులతో సంప్రదించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పాఠశాలలో, హాస్టల్‌లో పరిశుభ్రత పాటించాలనీ, దోమల నుంచి రక్షణ కోసం నెట్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌, వసతి సామగ్రిని వెంటనే అందించాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి అధికారులు నెలవారీ రిపోర్ట్‌ను తెప్పించుకోవాలనీ, ప్రయత్న లోపాలు లేకుండా విద్యార్థులకు విద్య, వనతులు అందించాలని అన్నారు. ప్రభుత్వ పరంగా మౌలికసదుపాయాల కల్పనలో ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నామనీ, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు విద్యార్థులకు అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. సరైన సదుపాయాలు లేని పాఠశాలను గుర్తించి వాటిని చక్కదిద్దే ప్రయత్నం చేయాలన్నారు. కిచెన్‌, వాటర్‌ ట్యాంక్‌లు, మరుగుదొడ్లు, బాత్‌రూంలు, పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం తొలగించాలని ఆదేశించారు. వసతి సదుపాయాలు సమగ్రంగా అందేలా చూడాలన్నారు. విద్యాబోధనలో నాణ్యమైన ప్రమాణాలు పాటించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారి నెలవారి ఆరోగ్య పట్టికను సిద్ధం చేయాలని సూచించారు. ప్రతినెలా ఎత్తు, బరువు నమోదు చేయాలనీ, అకడమిక్‌ వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలనీ. వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్‌, ఎంజేపీ కార్యదర్శి బడుగు సైదులు, జాయింట్‌ సెక్రెటరీలు తిరుపతి, మద్దిలేటి, ఎంబీసీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సీఈవో అలోక్‌ కుమార్‌, బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, జెడి ఇందిర తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -