– వరద నిర్వహణకు హైదరాబాద్ తరహాలోనే జిల్లాల్లో ఏర్పాట్లు
– ప్రకృతి విపత్తుల విభాగం బలోపేతానికి ఉన్నత స్థాయి కమిటీ
– వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలి
– నష్టం జరగకముందే స్పందించాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాల్లో వీలైనంత మేరకు ప్రాణ, ఆస్థి, ఆర్థిక నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలనీ, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వరద నిర్వహణపై ఆయా జిల్లాల కలెక్టర్లతో గురువారం హైదరాబాద్లోని సచివాలయంలో గల తన ఛాంబర్లో మంత్రి శ్రీనివాస్రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రకృతి విపత్తుల వల్ల నష్టం జరిగిన తర్వాత స్పందించే దానికంటే నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ తరహాలోనే రాష్ట్ర స్థాయిలో ప్రధానంగా వరద ప్రభావిత ప్రాంతాలలో చేపట్టవలసిన చర్యలు, విపత్తుల నిర్వహణా విభాగం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా కమిషనర్, అగ్నిమాపక డీజీ, విపత్తుల నిర్వహణ కమిషనర్ , కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్, నీటిపారుదల, ఆర్అండ్బి, ఆరోగ్య శాఖల కమిషనర్లతో ఉన్నత స్ధాయి కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ కమిటీ వారంలోగా ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. జూలై, ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో హఠాత్తుగా వచ్చే వర్షాల వల్ల ఊహించని వరదలు వస్తున్నాయనీ, గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీవాహక ప్రాంతాల్లోని నివాసితులను గుర్తించి వారిని అక్కడి నుంచి శాశ్వతంగా తరలించాలనీ, వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విపత్తుల నిర్వహణ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అన్ని శాఖలతో సమన్వయంతో పని చేయాలన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు, నిర్వహణ, ముందస్తు హెచ్చరికల కోసం అవసరమైన యూజర్ ఐడీలను ఇవ్వాలనీ, ఆయా జిల్లాల్లో పరిస్ధితులను బట్టి వరదల కార్యాచరణ ప్రణాళికలను ఈనెల 30వ తేదీలోగా తయారు చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.
అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES