నవతెలంగాణ-హైదరాబాద్: రుణాల భారం, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వొడాపోన్ ఐడియాకు కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు ఉపశమన ప్యాకేజీని ప్రకటించింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (AGR) బకాయిలను రూ.87,695 కోట్లకు సర్దుబాటు చేసి స్తంభింపచేసింది. 2032-41 మధ్య రూ.87,695 కోట్ల బకాయిలను చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. ఏజీఆర్ సంబంధిత అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పునఃపరిశీలించాలని 2020లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో 20 కోట్ల మంది వొడాఫోన్ ఐడియా వినియోగదారుల ప్రయోజనాలకు రక్షణ ఏర్పడుతుందని, టెలికాం రంగం మనుగడ, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచేందుకు ఒక లైఫ్లైన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. వొడాఫోన్ ఐడియాలో భారత ప్రభుత్వానికి సుమారు 49 శాతం వాటా కూడా ఉంది.
కాగా, రూ.20,668 కోట్లతో రెండు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కూడా కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. నాసిక్-షోలాపూర్ 6 లేన్ల ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. నాసిక్-షోలాపూర్ కారిడార్ను కర్నూలు, కడప, చెన్నై వరకు విస్తరించనున్నారు.



