నవతెలంగాణ-హైదరాబాద్ : బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఓ వ్యాపారి హత్య రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యంపై విపక్షాలు అధికార ఎన్డీయే కూటమిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. పాట్నాకు చెందిన వ్యాపారి గోపాల్ ఖేమ్కా హత్య ఘటనతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ఈ ఘటనపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదివారం తీవ్రంగా స్పందించారు. నితీశ్ కుమార్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ఎన్డీయే పాలనలో బీహార్ ‘భారతదేశ నేర రాజధాని’గా మారిపోయిందని ఆరోపించారు. “ప్రస్తుతం బీహార్ దోపిడీలు, కాల్పులు, హత్యల నీడన బతుకుతోంది. ఇక్కడ నేరాలు సర్వసాధారణమైపోయాయి, ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది” అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం నుంచి బీహార్ను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
మరోవైపు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పట్నా నడిబొడ్డున ఈ దారుణం జరిగితే, ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టిందని ఆయన ఆరోపించారు. “ఇది చాలా భయంకరమైన సంఘటన. వ్యాపారవేత్తలు బీహార్ విడిచి వెళ్ళిపోవాలని చూస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ హత్యోదంతానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఎన్నికల ముందు ఈ ఘటన జరగడంతో, ఇది అధికార కూటమికి రాజకీయంగా ఇబ్బంది కలిగించే అంశంగా మారింది.