నవతెలంగాణ-హైదరాబాద్: బద్లాపూర్ లైంగిక వేధింపుల కేసులో సహ నిందితుడు తుషార్ ఆప్టేను కుల్గావ్-బద్లాపూర్ మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్గా బిజెపి నియమించింది. తుషార్ ఆప్టే నియామకాన్ని కౌన్సిల్ చైర్పర్సన్ రుచితా ఘెర్పడే సమర్థించారు. మున్సిపల్ కౌన్సిల్కు శుక్రవారం ఐదుగురు కో-ఆప్టెడ్ కౌన్సిలర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. వారిలో ఇద్దరు బిజెపి, మరో ఇద్దరు శివసేన (షిండే), ఒకరు ఎన్సిపి పార్టీ నామినేటెడ్ అభ్యర్థి ఉన్నారని అన్నారు. ఆప్టేతో పాటు ఇతర నామినేటెడ్ కౌన్సిలర్లలో షాగోఫ్ గోర్ (బిజెపి), ప్రభాకర్పాటిల్ (ఎన్సిపి), దిలీప్ బైకర్, హేమంత్ చతురే (శివసేన)లు ఉన్నారు.
బద్లాపూర్లో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యా సంస్థకు తుషార్ ఆప్టే అప్పటి కార్యదర్శిగా ఉన్నారు. నేరాన్ని పోలీసులకు వెల్లడించకుండా ఉన్నందుకు ఆప్టేపై కేసు నమోదైంది. పిల్లలపై లైంగిక వేధింపుపల కేసులో ఫిర్యాదు చేయనందుకు పాఠశాల యాజమాన్యంపై పోక్సో చట్టంలోని సెక్షన్ 21(2) కింద కేసు నమోదైంది. ఘటన జరిగిన 44 రోజుల అనంతరం ఆప్టేను అరెస్ట్ చేసి 48గంటల్లోపు బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసు ప్రస్తుతం సబ్జ్యుడీస్లో ఉంది.
థానె జిల్లాలోని బద్లాపూర్లో పాఠశాలలోని టాయిలెట్లో ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రధాన నిందితుడు అక్షరు షిండేను 2024 ఆగస్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 23న, నవీ ముంబయిలోని తలోజా జైలు నుండి విచారణ కోసం తీసుకువెళ్తుండగా.. వ్యాన్లో ఒక పోలీస్ అధికారి తుపాకీని లాక్కుని కాల్పులు జరిపాడని, ఎదుర్కొనేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో అతను మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుడు అక్షరు షిండేపై అతని భార్య నమోదు చేసిన కేసులో విచారణ కోసం అతనిని తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగిందని అన్నారు.



