– 18న రాష్ట్ర బంద్కు స్పష్టమైన డిమాండ్ పెట్టాలి
– కేంద్రంపై పోరాడతామంటేనే మద్దతు
– లేదంటే స్వతంత్రంగా ఉద్యమిస్తాం : బీసీ జేఏసీ నేతలతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
– బీసీలకు న్యాయమైన వాటా కోసమే పోరాటం : ఆర్ కృష్ణయ్య
– కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి : జాజుల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు అడ్డుగా ఉన్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 18న రాష్ట్రబంద్కు స్పష్టమైన డిమాండ్ పెట్టాల్సిన అవసరముందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడతామనీ, బీజేపీ తీరును నిరసిస్తూ బంద్ చేపడితే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కేంద్రంతో పోరాటం చేయకుండా బంద్ చేపడితే బీసీల రిజర్వేషన్ల అమలు కోసం తాము స్వతంత్రంగానే పోరాటాన్ని కొన సాగిస్తామని వివరించారు. బీసీ రిజర్వేషన్ల కోసం బంద్ ఫర్ జస్టిస్ పేరుతో ఈనెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్కు మద్దతు ఇవ్వాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్కు బీసీ జేఏసీ నేతలు వచ్చారు. జాన్వెస్లీ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్, బండారు రవికుమార్తో జేఏసీ చైర్మెన్ ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మెన్ జాజుల శ్రీనివాస్గౌడ్, వైస్ చైర్మెన్ నారగోని, కోచైర్మెన్ రాజారాం యాదవ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు జరగాలని, అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేసిందన్నారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించి బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఆర్నెల్లైనా ఆమోదించలేదని తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుగా ఉందన్నారు. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చితే ఏ సమస్యా ఉండబోదని స్పష్టం చేశారు. ఆర్డినెన్స్ చేసి గవర్నర్కు పంపిస్తే దాన్ని కూడా కేంద్రానికి పంపారని గుర్తుచేశారు. బీసీ రిజర్వే షన్ల కోసం కేంద్రంపైనే పోరాడాలని పిలుపుని చ్చారు. అప్పుడే అమలవు తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలకే పరి మితం కాకుండా అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెం చేందుకు పోరాటం చేయాలన్నారు. రాష్ట్రబంద్ ఎవరికి వ్యతిరేకంగా జరుగు తున్నదో స్పష్టత ఉండాలని అన్నారు. బీజేపీ కూడా ఈ బంద్కు మద్దతు ఇస్తే ఎవరికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుందని ప్రశ్నిం చారు. కేంద్రంపై పోరాడాలనే స్పష్టత ఉంటేనే బంద్కు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. లేదంటే స్వతం త్రంగా పోరాటాలు చేస్తామన్నారు. బీసీ ల రిజర్వేషన్లకు, సామాజిక న్యాయా నికి సీపీఐ(ఎం) కట్టుబడి ఉందని చెప్పారు.
బీసీల బలం చూపెట్టాలి : ఆర్ కృష్ణయ్య
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవో 9 చట్టబద్ధం, రాజ్యాంగబద్ధమని బీసీ జేఏసీ చైర్మెన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికే షన్ వచ్చాక హైకోర్టు స్టే ఇచ్చి, బీసీల నోటికాడి ముద్దను లాక్కుందని తెలిపారు. బీసీల వాదనను కోర్టు వినలేదని చెప్పారు. న్యాయమైన వాటా దక్కడం కోసమే ఉద్యమం చేపట్టామని వివరించారు. ఈనెల 18న బంద్లో బీసీల బలం చూపెట్టాలని అన్నారు. సీపీఐ(ఎం) పేదల పక్షాన నిలబడుతుందనీ, బంద్కు మద్దతు ఇవ్వాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం అడగాలి… కేంద్రం చేయాలి : జాజుల
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అడగాలనీ, కేంద్రం చేయాలని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మెన్ జాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే జనాభా దామాషా ప్రకారం బీసీల రిజర్వేషన్లను రాజ్యాంగంలో చేర్చాలని సూచించారు. బీజేపీ ముఖ్యమా?, బీసీలు ముఖ్యమా?అని అంటే బీసీలే ముఖ్యమంటూ ఆర్ కృష్ణయ్య ముందుకొచ్చారని చెప్పారు. బీసీల రిజర్వేషన్ను ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని బీసీ జేఏసీ వైస్ చైర్మెన్ నారగోని అన్నారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు ఉన్నట్టుగానే బీసీ రిజర్వేషన్కు రాజ్యాంగంలో చట్టబద్ధత ఉండాలని బీసీ జేఏసీ కోచైర్మెన్ రాజారాం యాదవ్ సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవి రమణ, పి ఆశయ్య, బీసీ జేఏసీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లపై 17న చలో రాజ్భవన్ : సీపీఐ(ఎం)
రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రం వెంటనే 42 శాతం రిజర్వేషన్ల బిల్లు అమలును ఆమోదించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో చట్టాన్ని తేవాలనీ, తొమ్మిదో షెడ్యూల్లో రిజర్వేషన్ల ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఈనెల 17న చలో రాజ్భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులు, బీసీ వర్గాలు, సామాజిక శక్తులు, సంస్థలు, వ్యక్తులకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లును బీజేపీ ఆమోదిస్తూనే కేంద్రంలో మాత్రం అడ్డుకుంటు న్నదని విమర్శించారు. ఆపార్టీ నాయకులు, ఎమ్మెల్యే లు, ఎంపీలు, కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పోరాడుతూనే, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, కేంద్రంపై పోరాడితేనే సమస్య పరిష్కారమవుతుందని సూచించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.
కేంద్రం అడ్డుకోకుంటే బీసీ రిజర్వేషన్లు అమలయ్యేవి : ఎస్ వీరయ్య
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్రం అడ్డుకోకుంటే అమలయ్యేవని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. ఇందులో ఎవరికీ సందేహం లేదని తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడింది బీజేపీయేనని విమర్శించారు. ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పారు. బీజేపీ ఎంపీగా ఉన్న ఆర్ కృష్ణయ్య సహా అందరం కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్రంతో పోరాడతామంటే బంద్కు మద్దతివ్వడానికి తమకు అభ్యంతరం లేదన్నారు.
బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES