– మోడీ సొంతరాష్ట్రంలో రెండు స్థానాల్లో ఒక్కటే గెలుపు
– గుజరాత్ ప్రజల చూపు మా వైపే : కేజ్రీవాల్
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. గుజరాత్లోని రెండు అసెంబ్లీ స్థానాలకు, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళలోని ఒకొక్క అసెంబ్లీ స్థానానికి ఈ నెల 19న ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వీటి ఫలితాలను సోమవారం విడుదల చేశారు. అధికారంలో ఉన్న పంజాబ్లోని అసెంబ్లీ స్థానంతో పాటు, గుజరాత్లో ఒక్క స్థానాన్ని ఆప్ కైవసం చేసుకుంది. గుజరాత్లో మరో స్థానాన్ని మాత్రమే బీజేపీ గెలుచుకుంది. పశ్చిమ బెంగాల్ స్థానాన్ని అధికార టీఎంసీ గెలుచుకుంది. కేరళలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధించింది. అయితే అధికారంలో ఉన్న గుజరాత్లో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగినా బీజేపీ ఒక్క స్థానంలోనే విజయం సాధించడం, అది కూడా సానుభూతి ఓట్లతో గట్టెక్కడం కమలం పార్టీకి ఎదురుదెబ్బగానే విశ్లేషకులు భావిస్తున్నారు. గుజరాత్లోని విసావదర్, కడి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. 2022 ఎన్నికల్లో కడి నుంచి విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే కర్సాన్ సోలంకీ మరణంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో ఈసారి బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్ద కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ చావ్దపై 39వేల ఓట్లతో విజయం సాధించారు. విసావదర్లో ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా బీజేపీ అభ్యర్థి కిరిట్ పటేల్పై 17వేలకుపైగా ఓట్లతో గెలుపొందారు. ఈ స్థానంలో 2022 ఎన్నికల్లో ఆప్ విజయం సాధించినా ఎమ్మెల్యే భూపేంద్ర భయానీ బీజేపీలోకి చేరడంతో ఇక్కడ ఎన్నికలు జరపాల్సి వచ్చింది.ఇక పంజాబ్లో లుధియా వెస్ట్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోడా కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్ ఆషుపై 10 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్లోని ఖాళీగంజ్ అసెంబ్లీ స్థానంలో టీఎంసీ అభ్యర్థి అలీఫ్ అహ్మద్ కాంగ్రెస్ అభ్యర్థి కబీల్ ఉద్దీన్ షేక్పై 32 వేల ఓట్లతో గెలుపొందారు. ఈ స్థానంలో గత ఎన్నికల్లో విజయం సాధించిన నసీరుద్దీన్ అహ్మద్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. కేరళలోని నిలంబర్లో జరిగిన ఎన్నికల్లో ఎల్డీఎఫ్ అభ్యర్థి స్వరాజ్పై యూడీఎఫ్ అర్యాదన్ షౌకాత్ విజయం సాధించారు. ఇక్కడ గత ఎన్నికల్లో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి పివి అన్వర్ రాజీనామాతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. కాగా, ఈ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ గుజరాత్లో ప్రజలు బీజేపీ పాలనతో విసిగిపోయారని, వీరంతా ఇప్పుడు ఆప్ వైపే చూస్తున్నారని అన్నారు.ఈ ఉప ఎన్నికలను సెమీఫైనల్గా వర్ణించారు. పంజాబ్, గుజరాత్లో 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంజీవ్ అరోడా విజయంతో ఖాళీ అయ్యే రాజ్యసభ సీటు నుంచి ఎవరు పోటీ చేయాలనే విషయాన్ని ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుం టుందని చెప్పారు.కాగా, గుజరాత్లో రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ ఓటమి చెందడంతో ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ శక్తిసిన్హా గోహిల్ తన పదవికి రాజీనామా చేశారు.
బైపోల్స్లో బీజేపీకి భంగపాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES