స్పీకర్ నందకిషోర్ ఔట్
న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మంగళవారం తాజాగా 71 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ఇద్దరూ ఉన్నప్పటికీ, అసెంబ్లీ స్పీకర్ నంద్ కిషోర్ యాదవ్ను పాట్నా సాహిబ్ స్థానం నుంచి తొలగించింది. ఆయన 2010 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇతర ముఖ్యమైన పేర్లలో దానాపూర్ నుంచి పోటీ చేయనున్న పార్టీ సీనియర్ నాయకుడు రామ్ కృపాల్ యాదవ్, గయా నుంచి ప్రేమ్ కుమార్, కతిహార్ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్, సహర్సా నుంచి అలోక్ రంజన్ ఝా , సివాన్ నుంచి మంగళ్ పాండే ఉన్నారు. హిసువా స్థానానికి అనిల్ కుమార్ను తమ అభ్యర్థిగా నామినేట్ చేసింది.
బీహార్ అసెంబ్లీ స్పీకర్ నంద్ కిషోర్ యాదవ్కు జాబితాలో చోటు దక్కలేదు. ఆయన స్థానంలో రత్నేష్ కుష్వాహా పాట్నా సాహిబ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఇప్పటికీ ఏ పార్టీ ఏ సీటులో పోటీ చేస్తుందనే దానిపై చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ , జేడీయూ మధ్య సీట్ల పంపకాలలో చివరి నిమిషంలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా ఎన్డీఏ సీట్ల పంపకాల ఒప్పందాన్ని ప్రకటించడానికి జరగాల్సిన విలేకరుల సమావేశం రద్దుతో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6 , 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. మొదటి దశలో ఎన్నికలు జరిగే 121 సీట్లకు నామినేషన్లు దాఖలు చేయడానికి అక్టోబర్ 17 చివరి తేదీ. రెండవ దశలో 122 సీట్లకు గడువు అక్టోబర్ 20.