– మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో ఘటన
నవతెలంగాణ-నిజాంపేట్
సూట్కేసులో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమైన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో కలకలం రేపింది. బాచుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం విజయదుర్గా ఓనర్స్ అసోసియేషన్ కాలనీలోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ పక్కనున్న నిర్మానుష్య ప్రాంతంలో పడి ఉన్న సూట్కేసులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా సూట్కేస్లో గుర్తు తెలియని యువతి మృతదేహం ఉంది. సుమారు 25 నుంచి 30 ఏండ్లు గల యువతి, మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్ ధరించి ఉంది. అయితే ఆ మహిళను ఎక్కడో చంపేసి మృతదేహాన్ని సూట్కేసులో వేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి పడేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని బాలనగర్ డీసీపీ కె.సురేష్ కుమార్ సందర్శించి స్థానిక పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళను గుర్తించడం, మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు. అయితే మృతదేహం కుళ్ళిపోయిన విధానాన్ని బట్టి సుమారు ఐదు రోజులకు ముందే సూట్కేసును ఇక్కడ పడేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పరిసరాల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ వయసు గల మహిళల మిస్సింగ్ కేసులపై బాచుపల్లి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సూట్కేసులో యువతి మృతదేహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES