నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి థాయిలాండ్, కంబోడియా దేశాల సరిహద్దు వివాదాలు భగ్గుమన్నాయి. ఇరుదేశాలకు చెందిన వివాదాస్పద సరిహద్దులో ఆదివారం జరిగిన తాజా దాడుల్లో థాయిలాండ్ సైనికుడు ఒకరు మరణించినట్లు తెలిపింది. ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్లో సోమవారం తెల్లవారుజామున కంబోడియా దళాలు థాయ్ సైన్యంపై కాల్పులు జరిపాయని, తర్వాత తమ సైన్యం జరిపిన దాడికి దిగిందని థాయ్ ఆర్మీ ప్రతినిధి వింథాయ్ సువారీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దాడుల్లో ఒక సైనికుడు మరణించగా, నలుగురు గాయపడ్డారని అన్నారు. కంబోడియా దళాల దాడులను అణచివేయడానికి, అనేక ప్రాంతాల్లో సైనిక లక్ష్యాలను ఢీకొట్టేందుకు థాయిలాండ్ వైమానిక దాడులను చేపట్టిందని వింథాయ్ పేర్కొన్నారు.
థాయిలాండ్ దళాలు సోమవారం తెల్లవారుజామున ప్రీహ్ విహార్ మరియు ఒడ్డార్ మీన్చే సరిహద్దు ప్రావిన్స్ల్లో కంబోడియా దళాలపై దాడిచేశాయని, తమోన్ థామ్ ఆలయం వద్ద, ప్రీహ్ విహార్ ఆలయం సమీపంలో యుద్ధ ట్యాంకులతో పలుమార్లు కాల్పులు జరిపిందని కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాలీ సొచెటా పేర్కొన్నారు. కంబోడియా ప్రతీకారం తీర్చుకోలేదని ఆమె అన్నారు. సరిహద్దుల వెంబడి ఉన్న గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఇరు దేశాలు ప్రకటించాయి.



