నవతెలంగాణ-హైదరాబాద్ : వారం రోజుల అవాంతరాలు, ప్రతిష్టంభన అనంతరం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే లోక్సభలో విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. బీహార్లో ‘సర్’ పేరుతో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎస్ఐఆర్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీంతో ఉభయసభలు ఇవాళ కూడా వాయిదా పడ్డాయి. విపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. మరోవైపు రాజ్యసభలోనూ అదే పరిస్థితి కొనసాగింది. సభ ప్రారంభంకాగానే బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై విపక్ష కూటమి ఎంపీలు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది.