నవతెలంగాణ-హైదరాబాద్: తనపై దుష్ప్రచారాన్ని ప్రజలు ఓటుతో తిప్పికొట్టారు అని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు. భారీ మెజార్టీతో గెలిపించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. 24,729 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన ఆయనకు రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రం అందజేశారు.
అనంతరం నవీన్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ …. తన విజయం కోసం కృషి చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం, సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, సీనియర్ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనపై నమ్మకంతో ఓట్లు వేశారని అన్నారు. ఈ రోజుతో ఎన్నికలు ముగిశాయన్నారు. అందరం కలిసి మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేద్దాం అని పిలుపునిచ్చారు. భారత రాష్ట్రసమితి నేతలు తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, ఆ పార్టీ చేసిందేమీ లేకనే ప్రచారంలో చెప్పుకోలేదు అని, కేవలం తన గురించి దుష్ప్రచారం చేసి గెలవాలని బీఆర్ఎస్ చూసిందని ఆరోపించారు. అన్ని దుష్ప్రచారాలను ప్రజలు ఓటుతో తిప్పికొట్టారు అని చెప్పారు.
బెదిరిస్తే ప్రజలు ఓటు వేసే రోజులు ఎప్పుడో పోయాయన్నారు. తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు 98,988 ఓట్లు, భారత రాష్ట్రసమితి అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు, బిజెపి అభ్యర్థి లంకల దీపక్రెడ్డికి 17,061 ఓట్లు పోలయ్యాయి.



