– ఐదు వికెట్లతో విజృంభించిన బుమ్రా
– ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 465/10
– భారత్, ఇంగ్లాండ్ తొలి టెస్టు మూడో రోజు
బుమ్రా బూమ్బూమ్తో విజృంభించాడు. ఐదు వికెట్లతో మెరిసిన బుమ్రా.. లీడ్స్లో భారత్కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందించాడు. ఒలీ పోప్ (106), హ్యారీ బ్రూక్ (99) సహా టెయిలెండర్లు రాణించటంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేసింది. రాహుల్ (47 నాటౌట్) రాణించగా రెండో ఇన్నింగ్స్లో భారత్ 90/2తో నిలిచింది. భారత్ ప్రస్తుత ఆధిక్యం 96 పరుగులు.
నవతెలంగాణ-లీడ్స్
పేస్ దళపతి జశ్ప్రీత్ బుమ్రా (5/83) ఐదు వికెట్ల ప్రదర్శనతో నిప్పులు చెరిగాడు. టాప్ ఆర్డర్ను కకావికలం చేసిన బుమ్రా.. ఆఖర్లో టెయిలెండర్లను సైతం పెవిలియన్కు సాగనంపాడు. ప్రసిద్ కృష్ణ (3/128), మహ్మద్ సిరాజ్ (2/122) సైతం వికెట్ల వేటలో బుమ్రాకు జతకలిశారు. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 100.4 ఓవర్లలో 465 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్ ఒలీ పోప్ (106, 137 బంతుల్లో 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (99, 112 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్లతో కదం తొక్కారు. వికెట్ కీపర్ బ్యాటర్ జెమీ స్మిత్ (40, 52 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), క్రిస్ వోక్స్ (38, 55 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు), బ్రైడన్ కార్స్ (22, 23 బంతుల్లో 4 ఫోర్లు) ధనాధన్ జోరు చూపించారు. టెయిలెండర్లు రాణించటంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో లోటు 6 పరుగులకు కుదించుకుంది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 90/2తో ఆడుతోంది. రాహుల్ (47 నాటౌట్), గిల్ (6 నాటౌట్) క్రీజులో అజేయంగా నిలిచారు.
బ్రూక్ మెరువగా..
యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (99) దంచికొట్టాడు. 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 112 బంతుల్లోనే 99 పరుగులు సాధించాడు. వన్డే తరహాలో పరుగులు పిండుకున్న బ్రూక్.. ఇంగ్లాండ్ స్కోరు వడివడిగా ముందుకు సాగింది. ఓవర్నైట్ సెంచరీ హీరో ఒలీ పోప్ (106) త్వరగా నిష్క్రమించినా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (20), వికెట్ కీపర్ జెమీ స్మిత్ (40), క్రిస్ వోక్స్ (38)తో కలిసి వరుసగా 51, 73, 49 పరుగుల భాగస్వామ్యాలు నిర్మించాడు. బజ్బాల్ షో చూపించిన బ్రూక్.. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్తో 65 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. సెంచరీ పరుగు దూరంలో నిలిచిన బ్రూక్ను ప్రసిద్ కృష్ణ లెగ్సైడ్ వ్యూహంతో పడగొట్టాడు. బ్రూక్ వెనుదిరిగినా, ఇంగ్లాండ్ టెయిలెండర్లు పరుగుల వేట ఆపలేదు. క్రిస్ వోక్స్, జోశ్ టంగ్ (11) తొమ్మిదో వికెట్కు మరో 55 పరుగులు జోడించారు. దీంతో 100.4 ఓవర్లలోనే ఇంగ్లాండ్ 465 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో 6 పరుగుల ఆధిక్యం కోల్పోయింది.
రాణించిన రాహుల్
కెఎల్ రాహుల్ (47 నాటౌట్), సాయి సుదర్శన్ (30, 48 బంతుల్లో 4 ఫోర్లు) మెరవటంతో రెండో ఇన్నింగ్స్లో భారత్ 90/2తో నిలిచింది. యశస్వి జైస్వాల్ (4) ఆరంభంలోనే నిష్క్రమించగా.. సాయి సుదర్శన్తో కలిసి రాహుల్ కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. బెన్స్టోక్స్కు మరోసారి వికెట్ కోల్పోయినా.. సుదర్శన్ ఆకట్టుకున్నాడు. గిల్ (6 నాటౌట్) తొలి బంతినే బౌండరీ బాది ధనాధన్ చూపించాడు. వర్షంతో అంతరాయంతో మూడో రోజు ఆటను అంపైర్లు ముగించారు. 23.5 ఓవర్లలో భారత్ 90 పరుగులు చేయగా.. ఓవరాల్గా 96 పరుగుల ముందంజలో కొనసాగుతుంది.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 471/10
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : క్రాలీ (సి) నాయర్ (బి) బుమ్రా 4, డకెట్ (బి) బుమ్రా 62, పోప్ (సి) పంత్ (బి) ప్రసిద్ 106, రూట్ (సి) నాయర్ (బి) బుమ్రా 28, బ్రూక్ (సి) ఠాకూర్ (బి) ప్రసిద్ 99, స్టోక్స్ (సి) పంత్ (బి) సిరాజ్ 20, స్మిత్ (సి) సాయి (బి) ప్రసిద్ 40, వోక్స్ (బి) బుమ్రా 38, కార్స్ (బి) సిరాజ్ 22, టంగ్ (బి) బుమ్రా 11, బషీర్ నాటౌట్ 1, ఎక్స్ట్రాలు : 34, మొత్తం : (100.4 ఓవర్లలో ఆలౌట్) 465.
బౌలింగ్ : బుమ్రా 24.4-5-83-5, సిరాజ్ 27-0-122-2, ప్రసిద్ 20-0-128-3, జడేజా 23-4-68-0, ఠాకూర్ 6-0-38-0.
భారత్ రెండో ఇన్నింగ్స్ : జైస్వాల్ (సి) స్మిత్ (బి) కార్స్ 4, రాహుల్ నాటౌట్ 47, సాయి సుదర్శన్ (సి) క్రాలీ (బి) స్టోక్స్ 30, గిల్ నాటౌట్ 6, ఎక్స్ట్రాలు : 3, మొత్తం : (23.5 ఓవర్లలో 2 వికెట్లకు) 90.
బౌలింగ్ : వోక్స్ 6-2-18-0, కార్స్ 5-0-27-1, టంగ్ 5-0-15-0, బషీర్ 2.5-1-11-0, స్టోక్స్ 5-1-18-1.
బుమ్రా బూమ్బూమ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES