Friday, June 13, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిభారంగా బస్‌పాస్‌

భారంగా బస్‌పాస్‌

- Advertisement -

ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో లాక్కోవటమంటే ఇదే కాబోలు. మహాలక్ష్మి పథకం పేరుతో రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం…పేద, మధ్యతరగతి పిల్లల మీద బస్‌పాస్‌ల భారాలేసింది. ఇదేంటని అడిగితే… ”మసిపూసి మారేడుకాయ” చందంగా డొంక తిరుగుడు సమాధానాలిస్తోంది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉంటున్నందున… వారికి ఆర్డినరీ బస్సులతోపాటు మెట్రోల్లో కూడా ప్రయాణించేందుకు వీలు కల్పించామన్నది ఆ సంస్థ వివరణ. వారి సౌక ర్యార్థమే ఈ నిర్ణయం తీసుకున్న దరిమిలా… ఛార్జీలను పెంచక తప్పటం లేదన్నది ఉన్నతాధికారుల సమర్థన. కానీ మహిళలకు ఉచిత ప్రయాణ మంటూ చెప్పి.. వారి పిల్లల పాస్‌ల రూపేణా ఆ మొత్తాన్ని పిండుకో జూస్తున్నారనేది జనం వాదన. ఇది సత్యదూర మేమీ కాదు.
వాస్తవానికి మహాలక్ష్మి పథకం కోసం నెలకు సగటున రూ.350 కోట్లను సబ్సిడీ రూపంలో ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు విద్యార్థుల పాస్‌ల ఛార్జీలను పెంచటం ద్వారా సమకూర్చుకోవాలను కుంటున్న రూ.వంద కోట్ల(సుమారు)ను సర్కారు భరించలేదా? అనే ప్రశ్న ఉత్పన్నం కాకమానదు. ఆధార్‌ కార్డు చూపించటం ద్వారా రాష్ట్రంలోని బాలికలు, యువతులందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో… ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అదే రూపంలో బాలురు, విద్యార్థులకు కూడా ఉచిత ప్రయాణాన్ని కల్పించవచ్చు కదా? అని సామాజికవేత్తలు నిలదీస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలకు వేటికీ ఏలికల వద్ద సమాధానాల్లేవు.
ఇక్కడ ఓ విచిత్రకరమైన పరిస్థితిని ఆర్టీసీ ఎదుర్కొంటోంది. గతంలో విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు, జర్నలిస్టులు తదితరులకు రాయితీపై ఇచ్చే పాస్‌లకయ్యే సబ్సిడీ(రీయింబర్స్‌మెంట్‌)ని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించేది. కానీ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ ఒక్క పథకానికే సబ్సిడీని చెల్లించి, మిగతా పాసులపై ఇస్తున్న సబ్సిడీలకు మంగళం పాడటం గమనార్హం. దీంతో ఆర్టీసీపై పెద్ద మొత్తంలో భారం పడుతోంది. మరోవైపు మహాలక్ష్మి గురించి ఆర్భాటపు ప్రకటనలు గుప్పిస్తోన్న ప్రభుత్వ పెద్దలు… దాని అమలుకు తగినట్టుగా బస్సుల సంఖ్యను పెంచటం లేదు. 2023 డిసెంబరులో ఈ పథకాన్ని ప్రవేశపెట్టి నప్పుడే దీనిపై రవాణా రంగ నిపుణులు, ఆర్టీసీ కార్మిక సంఘాలు పలు సూచనలు చేశాయి. ఈ స్కీమ్‌ సక్రమంగా అమలు కావాలన్నా, మహిళలు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాన్ని వినియోగించు కోవాలన్నా ఇప్పుడున్న బస్సుల సంఖ్యకు అదనంగా మరో మూడు వేల బస్సులను పెంచాలని ఆ సూచనల సారాంశం. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే వెయ్యి నుంచి 1,500 బస్సులను అదనంగా పెంచాలంటూ ప్రభుత్వానికి ఆయా సంఘాలు సూచించాయి. కానీ బస్సుల సంఖ్యను పెంచకపోగా హైదరాబాద్‌ వంటి నగరాల్లో కుదించటం గమనార్హం. ఫలితంగా ప్రయాణ సమయాల్లో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ. చాలినన్ని బస్సులు లేక, ఉన్నా సీట్లు లేక ఘర్షణలు, గొడవలు షరా మామూలైపోయాయి.
సరళీకరణ ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజా రవాణా వ్యవస్థను నిర్వీర్యం చేయటం పాలకులకు పరిపాటిగా మారింది. అందులో భాగంగానే కొత్త బస్సులను కొనుగోలు చేయకపోవటం, వాటి స్థానంలో అద్దె బస్సులు, కాలం చెల్లిన బస్సులను తిప్పటం రివాజుగా మారింది. అది కాంగ్రెసైనా, బీఆర్‌ఎస్సైనా… మరెవరైనా ఇదే పోకడ. ఈ క్రమంలో ప్రజా రవాణా వ్యవస్థ అనే ఉన్నతమైన ఆలోచనల స్థానంలో లాభాలున్న రూట్లలోనే బస్సులను తిప్పుతామనే స్థితికి ఆర్టీసీ ప్రమాణాలు పడిపోయాయి. లాభాపేక్ష లేకుండా ప్రజలందరికీ బస్సు సౌకర్యాన్ని కల్పించాలనే ప్రజా రవాణా వ్యవస్థ మౌలిక సూత్రానికి ఈ రకంగా మన పాలకులెప్పటి నుంచో చెల్లుచీటి రాస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విద్యార్థుల బస్‌పాస్‌లపై భారాలు, మహాలక్ష్మి పథకానికి బస్సుల కోతలు వగైరా. ఛార్జీల పెంపు రూపంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఏ మేరకు భారాలేశారు? ఒక్కో బస్‌పాస్‌పై సగటున ఎంత ఛార్జీ పెరిగింది? అనే లెక్కలను కాసేపు పక్కన పెడితే… మొత్తంగా ప్రభుత్వం వైపు నుంచి, ఆర్టీసీ సంస్థ వైపు నుంచి విధానపరంగానే మార్పు రావాలి. ఆదాయాన్వేషణలో భాగంగా ఆర్టీసీ కార్గో విజయవంతమైన నేపథ్యంలో… అలాంటి మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలి. అప్పుడే సంస్థ బలోపేతమవుతుంది. ప్రజా రవాణా వ్యవస్థ సామాన్యుడికి చేరువవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -