Sunday, June 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసామాన్యులకు బస్‌ ప్రయాణం భారం

సామాన్యులకు బస్‌ ప్రయాణం భారం

- Advertisement -

పెంచిన బస్‌ పాస్‌ చార్జీలను తగ్గించాలి : సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి వెంకటేశ్‌
ఆర్టీసీ బస్సు భవన్‌ ముందు భారీ ధర్నా
ఆర్టీసీ సంస్థల కార్యదర్శి ముని శేఖర్‌కు వినతిపత్రం
నవతెలంగాణ – ముషీరాబాద్‌

బస్‌ పాస్‌ చార్జీలను పెంచి సామాన్యులకు ప్రయాణ సౌకర్యాన్ని భారంగా మార్చారని, పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి వెంకటేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద గల బస్‌భవన్‌ ముందు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ సంస్థల కార్యదర్శి ముని శేఖర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి మాట్లాడుతూ.. ఆర్టీసీ యాజమాన్యం ఇటీవల 20 నుంచి 50 శాతం వరకు బస్‌ పాస్‌ చార్జీలు పెంచడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల బస్‌ పాస్‌ రూ.400 నుంచి 600కు పెంచడం చాలా దారుణమన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సమయంలో బస్‌ పాస్‌ చార్జీలు పెంచి విద్యార్థులకు కానుకగా ఇస్తున్నట్టు ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పేద మధ్యతరగతి ప్రజలు, అసంఘటిత రంగ, కాంట్రాక్టు కార్మికులు ఎక్కువగా బస్సుల్లో ప్రయాణిస్తారని తెలిపారు.
ఆర్డినరీ బస్‌పాస్‌ను రూ.1150 నుంచి రూ.1400కు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.1300 నుంచి రూ.1600కు, మెట్రో డీలక్స్‌ రూ.1450/- నుంచి రూ.1800కు పెంచి సామాన్యులకు ప్రయాణ సౌకర్యాన్ని దూరం చేస్తున్నారని చెప్పారు. పెరుగుతున్న నిత్యావసర ధరల నేపథ్యంలో బస్‌ పాస్‌ చార్జీలు కూడా పెంచి మరింత భారం ప్రజలపై వేస్తున్నారన్నారు. వెంటనే పెంచిన బస్‌ పాస్‌ చార్జీలను తగ్గించాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో సీపీఐ(ఎం) నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్‌, మహేందర్‌, ఆర్‌.వెంకటేష్‌, కుమారస్వామి, మారన్న, నరేష్‌, కిరణ్‌, అశోక్‌, అజరుబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -