Monday, June 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు క్యాబినెట్‌ భేటీ

నేడు క్యాబినెట్‌ భేటీ

- Advertisement -

– బనకచర్ల నీటి వివాదం, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై కీలక చర్చ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో క్యాబినెట్‌ భేటీ కానుంది. బనకచర్ల నీటి వివాదం, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై ప్రధానంగా చర్చించనుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందన్న ఆందోళన నేపథ్యంలో ఈ క్యాబినెట్‌ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే… ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రకటించేందుకు క్యాబినెట్‌ సమావేశం నిర్వహి స్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ప్రధాన కర్తవ్యం స్థానిక సంస్థల ఎన్నికలే. అయితే ఎన్నికలకు వెళ్లే ముందు అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, ప్రభుత్వ పథకాలపై లబ్దిదారుల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలను ఆ జిల్లాల ఇన్‌చార్జి మంత్రుల ద్వారా సీఎం తెలుసుకునే అవకాశం ఉన్నది. తొమ్మిది రోజుల్లో రైతుభరోసా పూర్తి చేస్తామంటూ ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విధంగానే ఆ ప్రక్రియ పూర్తి కావొస్తున్నది. దీంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల గుర్తింపు, బేస్‌ మెంట్‌ లెవల్‌ పూర్తయిన ఇండ్లకు నిధుల విడుదల వంటి అంశాలపై క్యాబినెట్‌లో చర్చించనున్నారు. వీటన్నింటిపై ఇన్‌చార్జి మంత్రులు జిల్ల్లాల్లోని ఉన్నతాధికారులతో ఇప్పటికే సమీక్షలు నిర్వహించారు. దీంతోపాటు మంత్రుల క్షేత్రస్థాయి పరిశీలనాంశాలనూ క్యాబినెట్‌లో ప్రస్తావించనున్నారు. వీటన్నింటి ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
సీఎం రేవంత్‌తో డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు భేటీ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ప్రముఖ క్యాన్సర్‌ వైద్యులు, పద్మశ్రీ డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. విద్య, వైద్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. రాష్ట్రంలో క్యాన్సర్‌ కేర్‌ సిస్టం అభివృద్ధికి తాను అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సీఎంకు హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -