నవతెలంగాణ-హైదరాబాద్: కాల్పుల విరమణను కంబోడియా ఉల్లంఘించిందని థాయిలాండ్ ఆర్మీ మంగళవారం వెల్లడించింది. పూర్తిగా అటవీ ప్రాంతంతో కూడిన తమ సరిహద్దులో దాడులు కొనసాగుతున్నాయని పేర్కొంది. సోమవారం మలేషియాలో జరిగిన శాంతి చర్చల తర్వాత, అర్థరాత్రి నుండి కాల్పుల విరమణ ప్రారంభమవుతుందని ఇరుదేశాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే సమయంలో, కంబోడియా దళాలు తమ భూభాగంలోని అనేక ప్రాంతాల్లో సాయుధ దాడులు ప్రారంభించినట్లు తమ వర్గాలు గుర్తించాయని థాయిలాండ్ ఆర్మీ ప్రతినిధి వింథాయ్ సువారీ అన్నారు. ఇది ఒప్పందాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడమే కాకుండా పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీసే స్పష్టమైన ప్రయత్నం అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. థాయిలాండ్ తగిన విధంగా స్పందిస్తుందని, ఆత్మరక్షణ కోసం తమ చట్టబద్ధమైన హక్కును వినియోగించుకుంటుందని అన్నారు.
ఈ వార్తలను కంబోడియా ఖండించింది. అర్థరాత్రి 12 గంటలకు కాల్పుల విరమణ తర్వాత ఆర్మీని వెనక్కి రప్పించినట్లు కంబోడియా ప్రధాని హున్ మానెట్ పేర్కొన్నారు.