Tuesday, June 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజీహెచ్‌ఎంసీలోటెండర్లు రద్దు చేయండి

జీహెచ్‌ఎంసీలోటెండర్లు రద్దు చేయండి

- Advertisement -

మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ, ఇన్‌స్టంట్‌ రిపేర్‌ టీమ్స్‌లో అక్రమాలు : సీఎంకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లో మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ టీమ్స్‌, ఇన్‌స్టంట్‌ రిపేర్‌ టీమ్స్‌ టెండర్లను రద్దు చేసి, వార్డుల వారీగా మళ్లీ టెండర్లు పిలవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఆదివారంనాడామె సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లలోని స్థానిక కాంట్రాక్టర్లకు ఈ టెండర్ల వల్ల నష్టం కలుగుతుందన్నారు. ఈ పనులు చేపట్టేందుకు వినియోగించే వాహనాల్లో కొన్ని స్పెసిఫికేషన్స్‌ ఉండాలనే నిబంధనలు పెట్టారనీ, అలాంటి వాహనాలను విక్రయించే డీలర్లు హైదరాబాద్‌లో ఇద్దరే ఉన్నారని తెలిపారు. స్థానిక కాంట్రాక్టర్లకు ఆయా డీలర్లు వాహనాలు సరఫరా చేసేందుకు సమ్మతి ఇవ్వకపోవడంతో వారు కర్ణాటక డీలర్ల నుంచి ఎంవోయూ తీసుకొని టెండర్లలో పాల్గొన్నారని తెలిపారు. దీనికి సంబంధించిన ఫిజికల్‌ కాపీలు సమర్పించడానికి జీహెచ్‌ఎంసీలోని కొందరు అధికారులు తగినంత సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు. స్థానిక కాంట్రాక్టర్లను టెండర్లలో డిస్‌ క్వాలిఫై చేసి, తాము ముందే ఒప్పందం కుదుర్చుకున్న రెండు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా కొందరు అధికారులు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. పురపాలకశాఖను కూడా ముఖ్యమంత్రే నిర్వహిస్తున్నందున టెండర్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.
‘జాగృతి’కి అనుబంధంగా యూపీఎఫ్‌.. నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ జాగృతికి అనుబంధ సంస్థగా యునైటెడ్‌ ఫూలే ఫ్రంట్‌ పనిచేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె యూపీఎఫ్‌ నాయకులతో సమావేశమయ్యారు. నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. కన్వీనర్‌గా బొల్లా శివశంకర్‌, కో ఆర్డినేటర్‌గా ఆలకుంట హరి, సలహాదారుగా గట్టు రామచంద్రరావుతోపాటు మరో 50 మందిని కో కన్వీనర్లుగా నియమించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ జాగృతి, యూపీఎఫ్‌ ఐక్య పోరాటాలతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం దిగొచ్చి బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టిందన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడబలుక్కొని బీసీ బిల్లులను కోల్డ్‌స్టోరేజీలో పెట్టే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. బీసీ బిల్లులు సాకారం అయ్యేందుకు త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -