Friday, July 11, 2025
E-PAPER
HomeజాతీయంCancer Danger Bells: క్యాన్సర్‌ ప్రమాద ఘంటికలు… ఒకే జిల్లాలో 14,542 మంది మహిళలకు క్యాన్సర్‌

Cancer Danger Bells: క్యాన్సర్‌ ప్రమాద ఘంటికలు… ఒకే జిల్లాలో 14,542 మంది మహిళలకు క్యాన్సర్‌

- Advertisement -

నవతెలంగాణ ముంబయి: మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో వేలాది మంది మహిళల్లో క్యాన్సర్‌ అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. ఇది తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. క్యాన్సర్‌ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు సంజీవని పథకంలో భాగంగా అధికారులు జరిపిన స్క్రీనింగ్‌ పరీక్షల్లో ఈ విషయం బయటపడిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకాశ్ అబిత్కర్‌ తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీకి లిఖిత పూర్వక ప్రకటనలో మంత్రి ఈ విషయాలను వెల్లడించారు. మార్చి 8 నుంచి మొత్తంగా 2,92,996 మందికి సర్వే నిర్వహించగా.. క్యాన్సర్‌ లక్షణాలకు సంబంధించి ఇచ్చిన ప్రశ్నపత్రానికి మహిళలు సమాధానాలిచ్చారని మంత్రి పేర్కొన్నారు. వీరిలో 14,542 మంది మహిళల్లో క్యాన్సర్‌ తరహా లక్షణాలు గుర్తించినట్టు మంత్రి తెలిపారు.

స్క్రీనింగ్, టెస్టుల అనంతరం ముగ్గురికి గర్భాశయ క్యాన్సర్, ఒకరికి రొమ్ము క్యాన్సర్, ఎనిమిది మందికి నోటి క్యాన్సర్‌ ఉన్నట్టు నిర్ధరణ అయిందని మంత్రి తెలిపారు. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించి చికిత్స చేసేందుకు వీలుగా జిల్లా కలెక్టర్‌ చొరవతో హింగోలిలో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. అయితే, మహిళలకు ప్రత్యేక క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని మంత్రి స్పష్టం చేశారు. క్యాన్సర్‌ నిర్ధరణ కోసం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, స్క్రీనింగ్‌లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

అలాగే, జిల్లా ఆసుపత్రులు, వైద్య కళాశాల ఆస్పత్రుల్లో క్యాన్సర్‌కు చికిత్స అందించనున్నట్టు వెల్లడించారు. టాటా మెమోరియల్‌ ఆస్పత్రి నుంచి శిక్షణ పొందిన ‘క్యాన్సర్‌ వారియర్స్‌’ ప్రతి నెలా నిపుణులతో కలిసి రెండుసార్లు 11 ఆస్పత్రులను సందర్శిస్తారని అసెంబ్లీకి తెలిపారు. ఎనిమిది జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్‌ కీమోథెరపీ కేంద్రాలను ప్రారంభించామని, అన్ని జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -