వక్ఫ్ ఆస్తుల వివరాల నమోదుకు గడువు పొడిగింపుపై..
న్యూఢిల్లీ : వక్ఫ్ బై యూజర్తో సహా రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులను ఉమీద్ పోర్టల్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయడానికి గడువు పొడి గించాలని కోరుతున్న పలు పిటిషన్ల విషయంలో జోక్యం చేసుకోవ డానికి సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. జస్టిస్ దీపంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసిలతో కూడిన బెంచ్ ఈ విషయంలో సంబంధిత వక్ఫ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించేందుకు పిటిషనర్లకు స్వేచ్ఛనిచ్చింది. డిసెంబరు 6 లోగా డాక్యుమెంట్లను తక్షణమే అప్లోడ్ చేయాల్సిందిగా వక్ఫ్బోర్డు కోరింది. అన్ని వక్ఫ్ ఆస్తులకు జియోట్యాగింగ్ వేసిన తర్వాత డిజిటల్ ఇన్వెంటరీని ఏర్పాటు చేయడానికి జూన్ 6న కేంద్రం ఉమీద్ (యునిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫీషియన్సీ అండ్ డెవలప్మెంట్) పోర్టల్ను ప్రారంభించింది.
ఉమీద్ పోర్టల్కు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఆరు మాసాల్లోగా దేశవ్యాప్తంగా నమోదైన అన్ని వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇందులో అప్లోడ్ అవాల్సి వుంది. కాగా పోర్టల్ సరిగా పనిచేయడం లేదని, అప్లోడ్ చేసిన పుడు వివరాలు నమోదు కావడం లేదని పిటిషనర్లు వాదిస్తు న్నారు. గడువు తేదీ సమీపిస్తున్నదని, కానీ వివరాలు నమోదు కావడం లేదని అందువల్ల సుప్రీం కోర్టు జోక్యం చేసుకోకపోతే పెద్ద ఎత్తున ఆస్తిని నష్టపోతామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉమీద్ పోర్టల్ గడువును మరో ఆరు మాసాలు పొడిగించడం ద్వారా ఈ చట్టంలోని సెక్షన్ 3బి(1)ని తిరిగి రాయలేమని బెంచ్ పేర్కొంది. ఈ ప్రక్రియలో మరోసారి అడ్డంకి ఎదురైతే భవిష్యత్తులో సుప్రీంలో పిటిషన్ వేయడానికి గానూ స్వేచ్ఛనివ్వాల్సిందిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. దానిపై జస్టిస్ దత్తా వారికి ఆ స్వేచ్ఛ వుందని చెప్పారు.


