శ్రీరాం లైఫ్ ఇన్సూరెన్స్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించాలని శ్రీరాం లైఫ్ ఇన్సూరెన్స్ నిర్ణయించింది. ఈ ఏడాది (2026)లో ప్రభుత్వ పాఠశాలల నుంచి 10వ తరగతి బోర్డు పరీక్షలు రాసే విద్యార్థుల్లో టాపర్లకు రూ.2.2 కోట్ల నగదు బహుమతులను ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫస్ట్ వచ్చిన విద్యార్థికి రూ.5 లక్షలు, రెండో స్థానం వచ్చిన విద్యార్థికి రూ.3 లక్షలు, ప్రతి జిల్లా టాపర్ కు రూ.2 లక్షల చొప్పున, ప్రతి నియోజకవర్గ టాపర్కు రూ.ఒక లక్ష చొప్పున, 612 మండలాల్లో ప్రథమ స్థానం పొందిన విద్యార్థికి రూ.10 వేల నగదు అందజేయనున్నట్టు వెల్లడించింది. దీనికి సంబంధించిన గోడ పత్రికను వారు గురువారం హైదరాబాద్లో పాఠశాల విద్య సంచాలకులు డాక్టర్ ఇ.నవీన్ నికోలస్తో కలిసి విడుదల చేశారు.



