నవతెలంగాణ హైదరాబాద్: మహారాష్ట్రలోని పుణెలో మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టుకు మాత్రమే కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రతిపాదనలను ఏ మాత్రం కేంద్ర మంత్రి వర్గం పట్టించుకోలేదు. మహారాష్ట్ర సర్కారుతో కలిసి పుణె మెట్రో రెండో దశను చేపట్టేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. కానీ, హైదరాబాద్ మెట్రో రెండో దశ ‘ఏ’ భాగానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించి 8 నెలలు కావొస్తున్నా స్పందన కరవైంది.
ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా ప్రధాని మోడీని కలిసినప్పడల్లా విన్నవించారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిని సీఎం ఇటీవల స్వయంగా కలిసి మెట్రో విస్తరణకు ఆమోదం తెలపాలని కూడా కోరారు. అయినా కేంద్రం మెండిచేయే చూపింది. బుధవారం నాటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు అంశమే చర్చకు రాకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది.