నవతెలంగాణ- హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాటకమాడుతున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. ఒకవైపు కేంద్రంలో బీసీ రిజర్వేషన్ల బిల్లును, ఆర్డినెన్స్ను అడ్డుకుంటూ ఇంకోవైపు రాష్ట్రంలో ఈనెల 18న బీసీ జేఏసీ రాష్ట్ర బంద్కు బీజేపీ మద్దతు ఇచ్చిందని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసే పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా పోరాడితేనే ఈనెల 18న బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్రబంద్లో పాల్గంటామనీ, లేదంటే స్వతంత్రంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో బీసీ సంఘాలు, అభ్యుదయవాదులు, ప్రజాతంత్రవాదులు భాగస్వాములు కావాలని కోరారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసిందన్నారు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఏకగ్రీవంగా ఆమోదించి బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని వివరించారు. ఆర్నెల్లైనా ఆమోదించలేదని చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గం ఆర్డినెన్స్ను ఆమోదించి గవర్నర్కు పంపిస్తే దాన్ని కూడా కేంద్రానికి పంపించారని గుర్తు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో నెంబర్ తొమ్మిదిని విడుదల చేసిందన్నారు. ఆ జీవోపై హైకోర్టు స్టే విధించిందని చెప్పారు. ఆ స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే ఆ పిటిషన్ను తిరస్కరించిందని వివరించారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించుకోవాలంటూ సూచించిందని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు. ఈనెల 18న బీసీ జేఏసీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిందనీ, అన్ని రాజకీయ పార్టీల మద్దతునూ కోరిందని చెప్పారు. ఈ బంద్కు బీజేపీ కూడా మద్దతు ప్రకటించిందని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనీ, బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత ఆ పార్టీపైనే ఉందని అన్నారు. కాంగ్రెస్ కూడా బంద్కు మద్దతు ఇచ్చిందన్నారు. ఇప్పుడు రాష్ట్రబంద్ ఎవరికి వ్యతిరేకంగా జరుగుతున్నదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలున్నారని వివరించారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రజాప్రతినిధులు అడుగుతారా?అని ప్రశ్నించారు. బీసీ జేఏసీ నేతలు ఆలోచించాలనీ, కేంద్రం తీరుకు వ్యతిరేకంగా బంద్ నిర్వహించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం నిర్వహించాలనీ, కేంద్రంపై పోరాడాలని సూచించారు. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అంశంలో సీపీఐ(ఎం) మద్దతునిస్తుందని చెప్పారు. బంద్కు బీజేపీ మద్దతు ఇవ్వడంతో ప్రజలకు సరైన దిశ ఉండబోదని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని కోరుతూ కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు శుక్రవారం చలో రాజ్భవన్ కార్యక్రమానికి ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 18న బీజేపీకి వ్యతిరేకంగా బంద్ చేపడితే పాల్గంటామనీ, లేదంటే అదేరోజు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మండలాలు, పట్టణాల్లో ప్రదర్శనలు, ధర్నాలు, బైక్ యాత్రలు నిర్వహిస్తామనీ, కేంద్రం తీరును నిరసిస్తామని అన్నారు. ఇందులో బీసీ సంఘాలు, అభ్యుదయ సంఘాలు, ప్రజాతంత్రవాదులు పాల్గనాలని కోరారు.
బీసీ రిజర్వేషన్లకు ప్రధాన అవరోధం బీజేపీ : తమ్మినేని
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్రం అడ్డుకునే రాజకీయ పార్టీని అందరూ గుర్తించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ రిజర్వేషన్లకు ప్రధాన అవరోధం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని విమర్శించారు. ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 18న బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్ జరగాలన్నారు. బీజేపీ ఉన్న వేదికల్లో తాము పాల్గనేది లేదని స్పష్టం చేశారు. తాము స్వతంత్రంగా ఉద్యమాలను చేపడతామని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రంపై పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అఖిలపక్షం సహకారంతో ఢల్లీి కేంద్రంగా ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి సాగర్ తదితరులు పాల్గొన్నారు.