న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్పై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్కు నరేంద్ర మోడీ ప్రభుత్వం సుతరామూ అంగీకరించడం లేదు. అసలు ప్రభుత్వానికి ఆ ఆలోచనే లేదని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులైలో జరగాల్సి ఉన్నందున ఇప్పటికిప్పుడు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం సమర్ధనీయం కాదని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. ఆపరేషన్ సిందూర్పై వర్షాకాల సమావేశాలలో చర్చించాలన్న డిమాండ్ను పరిశీలించే అవకాశాలు కూడా తక్కువగానే కన్పిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్పై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలోనే ప్రతిపక్షాలకు వాస్తవాలన్నింటినీ వివరించామని ప్రభుత్వం గతంలోనే చెప్పింది.
పాక్పై అకస్మాత్తుగా యుద్ధం జరపడం వెనుక ప్రభుత్వం అవలంబించిన సైనిక, విదేశాంగ విధాన వ్యూహాలను గురించి చర్చించేందుకు పార్లమెంటును వెంటనే సమావేశపరచాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. గత నెల 10న కాల్పుల విరమణ జరిగిన తర్వాత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రధాని మోడీకి లేఖ రాస్తూ ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అయితే సైనిక చర్యకు విరామం ఇవ్వడం జరిగిందని బీజేపీ గుర్తు చేసింది. అనవసరమైన, అవాంఛనీయమైన ప్రశ్నలు లేవనెత్తవద్దని ప్రతిపక్షాలను కోరింది.
కాగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తేనెతుట్టెను మరోసారి కదిల్చాయి. పాక్తో జరిగిన యుద్ధంలో కొన్ని జెట్ విమానాలను కోల్పోయామని ఆయన అంగీకరించారు. అయితే ఎన్ని జెట్లు నేలకూలాయన్నది ముఖ్యం కాదని, అలా ఎందుకు జరిగిందనేదే ముఖ్యమని ఆయన చెప్పారు. దీనిపై ఖర్గే స్పందిస్తూ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తేనే అది సాధ్యపడుతుందని తెలిపారు. ఎమర్జెన్సీకి యాభై సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కూడా కాంగ్రెస్ కోరుతోంది. అయితే అలాంటి ఆలోచన ఏదీ లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
ప్రత్యేక సమావేశానికి కేంద్రం ‘నో’ ?
- Advertisement -
- Advertisement -