Tuesday, December 9, 2025
E-PAPER
Homeజాతీయంచరిత్రకు మళ్లీ మార్పులు

చరిత్రకు మళ్లీ మార్పులు

- Advertisement -

– గజనీ దండయాత్రలపై విస్తృత వివరాలు
– మథుర-సోమనాథ్‌ దేవాలయాల విధ్వంసంపై కూడా..
– ఏడో తరగతి పాఠ్యపుస్తకంలో చేర్పులు
– ఎన్‌సీఈఆర్‌టీ చర్యపై విద్యావేత్తల ఆందోళన
న్యూఢిల్లీ :
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తన కాషాయవాద సిద్ధాంతాన్ని పిల్లలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగా కొన్ని సంవత్సరాల నుంచి పాఠ్యపుస్తకాల్లో మార్పులకు దిగుతున్నది. ఇందుకు ఎన్‌సీఈఆర్‌టీని ఆయుధంగా వాడుకుంటున్నది. తమ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్న భాగాలను తొలగించడం, అనుకూలంగా ఉన్న చాప్టర్లను మరింతగా విస్తరించటం వంటివి చేస్తున్నది. తాజాగా ఇలాంటి మార్పులకే ఎన్‌సీఈఆర్‌టీ దిగింది. తాజాగా విడుదల చేసిన ఏడో తరగతి సోషల్‌ సైన్స్‌ పాఠ్యపుస్తకంలో గజనీ దండయాత్రలపై భాగాన్ని విస్తరించింది.
ఇప్పటి వరకు ఒక చిన్న పేరాలో మాత్రమే ఉన్న ఈ అంశాన్ని ఇప్పుడు ఆరు పేజీలుగా చేసింది. ఇందులో చిత్రాలు, వివరణాత్మక బాక్స్‌లు ఉన్నాయి. మహ్మద్‌ గజనీ చేసిన ‘విధ్వంసం, దోపిడీ’, అలాగే ‘ఇస్లాంకు సంబంధించి తన వెర్షన్‌ను ముస్లిమేతర ప్రాంతాల్లో వ్యాప్తి చేయాలన్న ఆసక్తి’ గురించి మరింత స్పష్టమైన వివరాలు ఉన్నాయి. ఇక మథుర, సోమ్‌నాథ్‌ దేవాలయాల విషయంలో ఆయన దోపిడీ, ధ్వంసం వంటి వివరాలతో పాటు గజనీ దండయాత్రల్లో వేలాది మంది భారతీయుల హత్య, పిల్లలను సహా అనేక మందిని బానిసలుగా మధ్య ఆసియా మార్కెట్లకు తీసుకెళ్లిన విషయాలను కూడా పాఠ్యం ప్రస్తావిస్తోంది. కంటెంట్‌ చాలా స్పష్టంగా ఉన్నదని ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ దినేశ్‌ సక్లానీ తాజా మార్పులపై స్పందించారు. ఇక సోమనాథ్‌ దేవాలయయం 1950లో ప్రజా విరాళాలతో పునర్నిర్మించబడిందనీ, అది ఎందుకు ప్రజల డబ్బుతో నిర్మించాల్సి వచ్చిందో విద్యార్థులు ఆలోచించాల్సిందిగా పుస్తకం సూచిస్తోంది. ఇక పాఠ్యపుస్తకంలోని మరో అధ్యాయంలో ఇతర తుర్కీ దండయాత్రలను కూడా వివరిస్తుంది. ఇందులో మొహమ్మద్‌ ఘోరీ, కుతుబ్‌-ఉద్‌-దిన్‌ ఐబక్‌, బఖ్తియార్‌ ఖిల్జీ దండయాత్రల గురించి కూడా ఉన్నాయి. ముఖ్యంగా బఖ్తియార్‌ ఖిల్జీ నలందా, విక్రమశిల వంటి బౌద్ద విద్యా కేంద్రాలను ధ్వంసం చేసిన విషయాన్ని హైలెట్‌ చేసింది. ‘ఈ విధ్వంసం భారత్‌లో బౌద్ధమత పతనాన్ని వేగవంతం చేసింది’ అని చరిత్రకారుల అభిప్రాయాన్ని పేర్కొన్నది.

చరిత్రను ఏకపక్షంగా చూపించడం భవిష్యత్‌ తరాలకు ప్రమాదకరం
ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలలో గజనీ, ఘోరీ, ఐబక్‌, ఖిల్జీ దండయాత్రలపై విస్తృత వివరాలను చేర్చిన విధానంపై పలువురు విద్వావేత్తలు, చరిత్రకారులు, రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం చరిత్రను ఏకపక్షంగా ప్రదర్శిస్తున్నదని ఆరోపిస్తున్నారు. మత, సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా కేవలం ముస్లిం పాలకుల దాడులు, హింస, దేవాలయాల విధ్వంసం వంటి అంశాలను ప్రభుత్వం హైలెట్‌ చేస్తున్నదనీ, ఇది చరిత్రను రాజకీయ లాభాల కోసం వాడుకోవడంలో భాగంగానే జరుగుతోందని విమర్శిస్తున్నారు. ఎన్‌సీఈఆర్‌టీ బోర్డు రాజకీయ ఒత్తిడికి గురవుతున్నదని ఆరోపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -