నవతెలంగాణ- పారిస్ : అభిమానుల మధ్య ఘర్షణలు ఉద్రిక్తతకు దారితీయడంతో ఆదివారం పారిస్ వీధులు హింసాత్మకంగా మారాయి. ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో పారిస్ సెయింట్- జర్మైన్ (పిఎస్జి) జట్టు , ఇంటర్ మిలన్ జట్టుపై 5-0 స్కోరుతో విజయం సాధించింది. బిగ్స్క్రీన్స్తో పాటు ప్రత్యక్షంగా ఈ మ్యాచ్ను చూసేందుకు సుమారు 50,000 మంది అభిమానులు పారిస్లోని చాంప్స్ -ఎలిసీస్ అవెన్యూ మరియు పిఎస్జికి చెందిన పార్క్ డెస్ ప్రిన్సెస్ స్టేడియానికి చేరుకున్నారు. పిఎస్జి విజయం సాధించడంతో అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ఇదే సమయంలో ఇంటర్ మిలన్ జట్టు అభిమానుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలు హింసాకాండకు దారితీశాయని అధికారులు తెలిపారు.
పారిస్ వీధుల్లో మొదలైన వేడుకలు హింసాత్మకంగా మారడంతో భద్రతాదళాలు రంగంలోకి దిగాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు ప్రయోగించారు. రెచ్చిపోయిన ఆందోళనకారులు భద్రతా దళాలపై దాడులకు దిగారు. బస్షెల్టర్లను ధ్వంసం చేయడంతో పాటు 200కి పైగా వాహనాలకు నిప్పుపెట్టారని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. ఈ హింసాకాండలో ఇద్దరు మరణించగా, 21మంది పోలీస్ అధికారులు సహా 200 మంది గాయపడ్డారని అన్నారు. పారిస్లో సుమారు 491మందిని అరెస్ట్ చేయగా, ఫ్రాన్స్ వ్యాప్తంగా మొత్తం 559 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.