సీఎం రాకతో అన్ని అభివృద్ధి పనులు పూర్తి
నవతెలంగాణ-వంగూరు
విజయదశమిని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన స్వగ్రామమైన అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డి పల్లికి గురువారం చేరుకున్నారు. ఈనేపథ్యంలో గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడికి చేరుకొని కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి కార్యక్రమం, అలయ్ బలయ్ ను నిర్వహించారు. కాగా, కొండారెడ్డిపల్లి గ్రామానికి రూ.200 కోట్ల అభివృద్ధి పనులను చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి పనుల్లో.. పాలశీలీకరణ కేంద్రం, బీసీ కమ్యూనిటీ హాల్, ఎస్సీ కమిటీ హాల్, గ్రంథాలయం, గ్రామపంచాయతీ, పిల్లల ఆటస్థలం, పాఠశాల అదనపు గదులు, ఇందిరమ్మ ఇండ్లు, సోలార్ సిస్టమ్, అండర్ విద్యుత్తు, అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, ప్లాంటేషన్ ఇలా చెప్పుకుంటూపోతే 19 రకాల కార్యక్రమాలను విజయవంతం చేశారని గ్రామస్తులు తెలిపారు. త్వరలో వంగూరు మండలంలో సమీకృత భవనాలు, 30 పడకల ఆస్పత్రి, రెండు లైన్ల రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్టు అధికారులు తెలిపారు. సాయంత్రం రోడ్డు మార్గాన తిరిగి కొడంగల్కు చేరుకున్నారు.