– ఉద్యోగ జేఏసీతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరపాలి : టీఎస్యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు విచారకరమని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఉద్యోగ జేఏసీతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు బోనస్లు అడగట్లేదనీ, సంక్షేమ పథకాలను ఆపి జీతాలను పెంచాలని కోరడం లేదని తెలిపారు. తమకు రావాల్సిన డీఏలు ప్రకటించాలనీ, తాము దాచుకున్న జీపీఎఫ్ సొమ్మును అవసరానికి ఇవ్వాలంటున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం 14 నెలలుగా ఎదురుచూస్తున్నారని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేస్తామంటూ చెప్పిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు మాట మార్చి ప్రజల్లో ఉద్యోగులను పలుచన చేయడం విచారకరమని తెలిపారు. సీఎం హోదాలో ఉండి చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి తప్ప కుటుంబం అంటూనే ఉద్యోగులను బజారున పడేయటం సమంజసం కాదని సూచించారు. గతేడాది అక్టోబర్ 24న జేఏసీ ప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్రెడ్డి మూడు గంటలపాటు సమస్యలన్నీ ఓపికగా విన్నారని పేర్కొన్నారు. ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం నియమిస్తామనీ, ఆర్థిక పరమైన వాటిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆర్నెల్లు గడుస్తున్నా మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కాలేని తెలిపారు. జేఏసీ ఇచ్చిన 57 డిమాండ్లలో 45 ఆర్థికేతర లేదా స్వల్ప ఆర్థిక భారం కలిగినవే ఉన్నాయని వివరించారు. ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే వెంటనే మంత్రివర్గ ఉపసంఘం లేదా సీఎం రేవంత్రెడ్డి జేఏసీ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వం పట్ల ఉద్యోగుల్లో వివ్వాసం నిలుపుకోవాలని కోరారు.
సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు విచారకరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES