ఈ వైఫల్యానికి కారణం ఎవరు.? నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది
కింది స్థాయి ఉద్యోగి దొంగతనం కేసుమీద పైస్థాయి ఉద్యోగిని ఎలా ప్రశ్నిస్తాడు?
ఇంత అదమంగా విచారణ ఉంటే ప్రజలు ఎలా విశ్వసిస్తారు? విచారణ చేస్తున్న పద్ధతి సరిగా లేదు
వై టి డి ఏ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో విచారణ జరపాలి..
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ : చింతపండు దొంగనే సరిగా విచారణ చేయలేని భద్రత వ్యవస్థ, లోప భూయిష్టమైన నిఘా వ్యవస్థ పెద్ద సంఘటన జరిగితే చేతులు ఎత్తేస్తారా? అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ప్రశ్నించారు. ఆదివారం, యాదగిరిగుట్ట పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రనికి తలమానికంగా ఉన్న, పవిత్రమైన స్థలమైనటువంటి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు విషాదకరంగా ఉన్నాయి. యాదగిరిగుట్ట దేవస్థానం పైన నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి చింత పండు దొంగతనం, వై టి డి ఎ పరిధిలో ఉన్నటువంటి యాదగిరిగుట్ట దేవస్థానంను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవతో అభివృద్ధి చేసింది. కానీ నిఘా వైఫల్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దేవస్థానం పూర్తిస్థాయిలో భద్రత సిబ్బంది పరిధిలో ఉండాలి. ప్రతి చోట సీసీ కెమెరాలు పనిచేయాలి. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే చర్యలు ఉండాలి. స్టోర్ రూమ్ లో జరిగినటువంటి చింతపండు దొంగతనంలో పూర్తి వైఫల్యం కనిపిస్తుంది. ఈ వైఫల్యానికి కారణం ఎవరు? నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటనలు పైన పైన మాట్లాడటం వల్ల పలుమార్లు పునరావృతం అయితే తప్ప ఆగే పరిస్థితి కనబడడం లేదు. దొంగతనం జరిగిన తర్వాత పట్టుబడిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారం దొంగతనం చేయమంటే చేసినము అని, మాకు దీనితో సంబంధం లేదు, పలానా వ్యక్తుల పేర్లతో సహా వాళ్ళు వెల్లడించారు. దీని వెనకాల ఉన్న రహస్యం ఏమిటంటే పై స్థాయి అధికారుల చేతులు కచ్చితంగా ఉన్నాయి. కేవలం కిందిస్థాయిలో జరిగిన విషయం కాదు. ఉన్నతాధికారులు కూడా దీని వెనకాల ఉన్నారు. ఇంకా ఎన్ని రకాల దొంగతనాలు జరుగుతున్నాయి అని అనుమానాలు వస్తున్నాయి.
దీనితో భక్తుల మనోభావాలు దెబ్బ తినే అవకాశం ఉంది. విచారణ అనేది ఒక ఉన్నత అధికారి మీద మరింత ఉన్నతాధికారులతో చేయించాలి. జిల్లా కలెక్టర్ స్థాయిలో విచారణ జరపాలి లేదా వై టి డి ఏ రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులతో విచారణ జరపాలి. దిగువ స్థాయి అధికారులతో విచారణ జరపడం వల్ల ఏం ఫలితం ఉంటుంది. కింది స్థాయి ఉద్యోగి దొంగతనం కేసు మీద పై స్థాయి ఉద్యోగిని ఎలా ప్రశ్నిస్తాడు? ఇంత అదమంగా విచారణ ఉంటే ప్రజలు ఎలా విశ్వసిస్తారు? విచారణ చేస్తున్న పద్ధతి సరిగా లేదు. చిన్న గ్రామపంచాయతీ కావచ్చు, చిన్న సంస్థ కావచ్చు స్టాక్ రిజిస్టర్ మైంటైన్ చేసి ఇన్పుట్ అవుట్ ఫుట్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఇంత పెద్ద వ్యవస్థ అభివృద్ధి అవుతున్న క్రమంలో, భక్తులు తమ కష్టార్జితాన్ని దేవునికి సమర్పిస్తున్న తరుణంలో వచ్చినటువంటి డబ్బులకు సార్థకత ఉండాలి. కొండను తవ్వుతే అనేక రకాల విషయాలు బయటపడే అవకాశం ఉంది. పైన పైన పరిశీలన చేస్తే ప్రజలు ఊరుకోరు, ప్రధానంగా బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు ఊరుకోవని అన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఫైవ్ మెన్ కమిటీ సరి అయింది కాదు. దీనిని ఉన్నత స్థాయిలో విచారణ జరపాలి. ఇంత పెద్ద దేవస్థానంలో పూర్తిస్థాయి ఈ వో ను నియమించాలి. తాత్కాలిక ఈ వో లను నియమించడం వలన పూర్తిస్థాయి అవగాహన రాదు. అజమాయిషి రాదు. పూర్తిస్థాయి ఈ వో ను నియమించడం తక్షణ అవసరం గా ఉంది. ప్రత్యేకమైన యాదగిరిగుట్ట ఈమధ్య ప్రభుత్వం స్వర్ణ గోపురాలను నిర్మించింది. ఎక్కడ చూసినా విలువైన సంపద ఈనాడు యాదగిరిగుట్టలో ఉంది. ఈ విలువైన సంపదను కాపాడాలంటే అత్యంత భద్రత ఉండాల్సిన అవసరం ఉంది. చిన్న దొంగనే పట్టుకోలేనటువంటి మీరు పెద్ద దొంగ కన్నంలో నుంచి పారిపోతారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బబ్బురి పోశెట్టి, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి నూకల భాస్కర్ రెడ్డి, పట్టణ కమిటీ సభ్యులు షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
చింతపండు దొంగతనం విచారణలో పూర్తి వైఫల్యం: సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES