రైతుల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ ఛానల్
నవతెలంగాణ – మల్హర్ రావు
వ్యవసాయంలో రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలు నేరుగా అందించేందుకు ప్రభుత్వం సాంకేతికతను తీసుకొస్తుంది. పంటల సాగు, చీడ, పీడల గురించి పూర్తి సమాచారం రైతులు తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా వాట్సాప్ ఛానల్ ఇటీవల ప్రారంభించింది. ఇందులో ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న రైతులు వ్యవసాయ శాఖ అధికారులు అందించే లింక్ ద్వారా చేర వచ్చు. గ్రామాల్లో ఇప్పటికే రైతులకు ఈ చానల్ పై అవగాహన కల్పిస్తున్నారు.శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ నిపుణులు ఆన్లైన్ ద్వారా రైతులకు సూచనలు, సలహాలు అందిస్తారు.
రైతులు వారికి కావాల్సిన సమాచారాన్ని పూర్తిగా తెలుగులోనే పొందవచ్చు. పంటలకు తెగుళ్లు, క్రిమి కీటకాలు సోకినప్పుడు రైతులు ఈ ఛానల్ ద్వారా కావాల్సిన సమాచారం పొందవచ్చు. ప్రస్తుతం రైతులు ఆశించిన స్థాయిలో వ్యవసాయ సమాచారం లేకపోవడంతో పంటల్లో దిగుబడులు కోల్పోతున్నారు. చీడ, పీడలతో పంటలు దెబ్బతిని ఆర్థికంగా నష్టపోతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ రైతులకు ఒకేసారి సమాచారం పొందడానికి ఈ డిజిటల్ వ్యవసాయ పరిజ్ఞానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. విత్తన దశ నుంచి పంట చేతికి వచ్చే వరకు పంటల పూర్తి సమాచారం రైతులు తెలుసుకోవచ్చు.
ఏఈఓల ద్వారా చేరవచ్చు..
మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో ఏఈఓలు రైతులను ఈ ఛానల్ లింక్ ద్వారా చేర్చుతున్నారు. పంటలకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా క్షణాల్లో పొందవచ్చు. అన్ని సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుంది. సమయం,ఖర్చు తగ్గుతుంది.