మాది ప్రజా ప్రభుత్వం… దొరల ప్రభుత్వం కాదు
రాష్ట్రంలో కొద్ది రోజుల్లోనే బిఆర్ఎస్ కనుమరుగవుతుంది
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నవతెలంగాణ ఇంటర్వ్యూలో ప్రభుత్వ విప్ శ్రీనివాస్
నవతెలంగాణ – సిరిసిల్ల
నవతెలంగాణ: తెలంగాణ రాష్ర్టాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పటికీ ఆ సమయంలో మీ పార్టీ ఎందుకు రాలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చింది మీరు జిల్లాలో ఏం అభివృద్ధి చేశారు.
ప్రభుత్వ విప్: తెలంగాణ రాష్ర్టాన్ని సోనియా గాంధీ ఇవ్వగా ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడం వాస్తవమే. తర్వాత ప్రజలే గ్రహించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనీ అధికారంలోకి తీసుకురావాలని ఓట్లు వేసి గెలిపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి జరిగింది. ప్రజలకు అనుకూలంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. మేము వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఇది మేము గర్హంగా చెప్పుకుంటున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో అనేక అభివృద్ధి చేశాం. అంతే కాకుండా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నాం. తిమింగలాలే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది. సామాజిక మాధ్యమాల్లో బిఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వీటిని ప్రజలు గమనిస్తూ వారికి తగిన బుద్ధి చెబుతున్నారు.
నవతెలంగాణ: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు సమర్థవంతంగా పనిచేయడం లేదు.
ప్రభుత్వ విప్: జిల్లాలో నాలాగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కష్టపడితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జిల్లాలో నేను గెలిచాను.. మహేందర్ రెడ్డి ఓడిపోవడం దురదృష్టకరం.. అయినా ఆయన పార్టీ కోసం, ప్రజల కోసం నియోజకవర్గంలో కష్టపడుతున్నాడు. మాది ప్రజా ప్రభుత్వం… దొరల ప్రభుత్వం కాదు… కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజల కోసం పనిచేస్తారు. జిల్లాలో పార్టీ ఎంతో అభివృద్ధి చెందింది. రాబోయే స్థానిక సంస్థల, మున్సిపాలిటీ ఎన్నికల్లో మా సత్తా చాటుతాం.
నవతెలంగాణ: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్టీ గ్రాఫ్ తగ్గుతున్నట్లు కనిపిస్తుంది.
ప్రభుత్వ విప్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గలేదు.. పెరిగింది. మా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల కోసం పనిచేసుకుంటూ వెళ్తారు. కానీ మిగతా పార్టీల నాయకుల్లాగా అనవసరపు వాటిలో తలదూర్చరు. జిల్లాలో ప్రజలు ఏం అవసరం ఉన్నా.. ఇబ్బంది కలిగినా.. నా దగ్గరకు, కేకే మహేందర్ రెడ్డి దగ్గరకు వస్తున్నారు. వారి సమస్యను సాధ్యమైనంత వరకు తీర్చుతున్నాం. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి జిల్లాలో అనేకమంది కౌన్సిలర్లు, సర్పంచులు, వివిధ పార్టీల్లో కీలక పదవుల్లో ఉన్నవారు కాంగ్రెస్లో చేరారు. ఇంకా అనేకమంది చేరడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీలో చేరుతున్నారంటే జిల్లాలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగినట్టేకదా… ఒకటి రెండు పనికిరాని పార్టీలు పనికట్టుకుని జిల్లాలో కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గలేదు. తగ్గదు. ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కొద్ది రోజుల్లో వాపును చూసి బలుపు అనుకున్న పార్టీ కనుమరుగవుతుంది.
నవతెలంగాణ: మీరు నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఎందుకు పర్యటించడం లేదు.
ప్రభుత్వ విప్: నేను నియోజకవర్గానికే పరిమితం అవ్వడం కాదు కానీ ఎక్కువ నా నియోజకవర్గానికి సమయం కేటాయిస్తున్నాను. అలాగే సిరిసిల్ల నియోజకవర్గంలో ఏ కార్యక్రమం ఉన్న వెళ్లడం జరుగుతుంది. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలు నా రెండు కళ్ళలాంటివి. అసలు విషయం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించాలని చెప్పారు. ప్రభుత్వ విప్ హోదాలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జరిగే కార్యక్రమాలు కూడా హాజరవుతున్నాను. వేములవాడకు సీఎం వచ్చిన్నప్పుడు బహిరంగ సభలో అభివృద్ధి పనుల కోసం అనేక నిధులు వెచ్చించారు. అలాగే సిరిసిల్ల నేతన్నలను దృష్టిలో ఉంచుకొని నూలు డిపోను మంజూరు చేశారు. ప్రభుత్వం నాకు చెప్పిన విధంగా నేను పని చేస్తున్నాను. ప్రభుత్వం నాకు ఏ బాధ్యత ఇచ్చిన క్రమశిక్షణతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తాను.
నవతెలంగాణ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలకు ఎందుకు జాప్యం చేస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వంకు అనుకూలత లేదనినోటిఫికేషన్ విడుదల చేయడం లేదా..?
ప్రభుత్వ విప్: ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో జాప్యం జరుగుతుందనేది వాస్తవం కాదు. ఏ సమయంలో ఎన్నికలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు గెలవడం ఖాయం. బి ఆర్ ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే చేసాం. ప్రజలకు అవి కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారంటీలను ఏడాదిలోనే అమలు చేసి తీరింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆదరణ పెరిగింది. మిగతా పార్టీలను ప్రజలు మర్చిపోతారు. మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.