బీసీలను విస్మరించిన బీఆర్ఎస్, బీజేపీకి గుణపాఠం :జాజుల శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీకి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ను గెలిపించిన ప్రజలు నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్, బీజేపీకి గుణపాఠం చెప్పారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీకి టికెట్ ఇవ్వని బీఆర్ఎస్ను ఓడించి, బీసీ రిజర్వేషన్ల పెంపు చట్టాన్ని ఆమోదించని బీజేపీకి డిపాజిట్లు గల్లంతు చేశారని హర్షం వ్యక్తం చేశారు. నవీన్ యాదవ్ గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తూ ఆ గెలుపు బీసీల గెలుపుగా అభివర్ణించారు. గెలుపు గుర్రాలంటే అగ్రకులాల వారే అనే ప్రచారానికి తెరపడిందనీ, బీసీలే గెలుపు గుర్రాలని నవీన్ యాదవ్ గెలుపు నిరూపించిందని పేర్కొన్నారు. రెండు ప్రధాన పార్టీల అగ్రకుల అభ్యర్థులతో పోటీపడి బీసీ అభ్యర్థి గెలవడం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రాజకీయ చైతన్యానికి నిదర్శనమన్నారు.



