ప్రజలపై రూ.82 వేల కోట్ల భారం
భట్టి విక్రమార్క నోరు అదుపులో పెట్టుకోవాలి
మీలా 30 శాతం కమీషన్ తీసుకోవడం రాకనే నేను అన్ఫిట్
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న సీఎం రేవంత్రెడ్డి : మాజీమంత్రి హరీశ్రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అసెంబ్లీలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామన్నారనీ, ఇప్పుడు కమీషన్ల కోసం థర్మల్ విద్యుత్ ప్లాంట్లు కట్టాలని నిర్ణయించి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింందని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. ఎన్టీపీసీ యూనిట్ విద్యుత్ను రూ.4.12కే ఇస్తున్నా కమీషన్ల కక్కుర్తితోనే ప్రజలపై రూ.82 వేల కోట్ల భారం మోపుతోందన్నా రు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఆర్థిక మంత్రిగాను తాను అన్ఫిట్ అయ్యానం టూ ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్కలా 20 శాతం, 30 శాతం కమీషన్లు తీసుకోవడం రాకనే తాను అన్ఫిట్ అయ్యానని ఎద్దేవా చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో పవర్ హాలిడే ఇచ్చిన కాంగ్రెస్ అన్ఫిట్టా? లేదంటే నాణ్యమైన కరెంటు ఇచ్చిన బీఆర్ఎస్ అన్ఫిట్టా?అని అడిగారు. తెలంగాణ వచ్చి 12 ఏండ్లు అవుతున్నా విద్యుత్ శాఖలో ఆంధ్రా అధికారుల పెత్తనమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ తెచ్చింది ప్రజా పాలన కాదనీ, ఆంధ్రా ద్రోహుల పాలన అని విమర్శించారు. సింగరేణిలో పనిచేసిన రాజశేఖర్రెడ్డి అనే ఆంధ్రా వ్యక్తిని జెన్కో డైరెక్టర్గా నియమించడమెంటని అడిగారు. తెలంగాణ విద్యుత్ ఇంజినీర్లను, ఉద్యోగులను అవమానించడమేనని అన్నారు. అర్హత లేని ఆంధ్రా అధికారుల కోసం తెలంగాణ బిడ్డలను బలిచేస్తారా? అని ప్రశ్నించారు. నాడు ఉద్యమకారుల ను అవమానించిన సమైక్యవాదులకే నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అందలం ఎక్కించారని ఆరోపించారు. గ్రీన్ ఎనర్జీ పాలసీలో పారిశ్రామికవేత్తలకు ఎక్కడి నుంచైనా గ్రీన్ ఎనర్జీ తీసుకుని వాడుకోవచ్చంటూ దరఖాస్తులను స్వీకరించారని చెప్పారు. ఒక్కొక్కరూ. రూ.25 వేలు చెల్లించి దరఖాస్తులు తీసుకుంటే రూ.600 కోట్లు వరకు వచ్చాయని వివరించారు. ఒక్కో మెగావాట్కు రూ.30 లక్షలు లంచం ఇవ్వలేదంటూ ఆ దస్త్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెట్టిందన్నారు.
అవినీతి ఆరోపణలు, ఏసీబీ కేసుల్లో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన నందకుమార్ను చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్గా నియమించారని విమర్శించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓట్ల కోసం సీఎం రేవంత్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం నిద్రపోతోందా? అని ప్రశ్నించారు. కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తున్నారనీ, ఆ నీళ్లు ఎక్కడికి పోతాయి? ఆ గ్రామాలకే కదా? ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలను ప్రభావితం చేసే ఆ పనికి ఎన్నికల కోడ్ ఎందుకు వర్తించదబోదని అడిగారు. శంకుస్థాపన చేస్తున్న రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు గ్రామాల నుంచి వెళ్లేవే రెండేండ్ల నుంచి ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందే గుర్తుకొచ్చాయా? అని అడిగారు. తక్షణమే ఎన్నికల సంఘం సమీక్షించి పోలీసులకు ఆదేశాలిచ్చి కేసు నమోదు చేయాలనీ, చట్ట పరంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శంభీపూర్రాజు, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, కార్పొరేషన్ మాజీ చైర్మెన్లు అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి, పల్లె రవికుమార్, నాయకులు కిషోర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



