పనుల వేగవంతానికి వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ
వందేండ్ల అవసరాలకు తగినట్టు వసతుల కల్పన
పనుల తీరుపై తరచూ క్షేత్ర స్థాయిలో తనిఖీ : సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా నూతన ఆస్పత్రి నిర్మాణం రెండేండ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉస్మానియా నూతన ఆస్పత్రి నిర్మాణంపై హైదరాబాద్లోని తన నివాసంలో సీఎం బుధవారం సమీక్ష నిర్వహించారు. నూతన ఆస్పత్రి అవసరాలకు తగినట్టు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలనీ, దానికి సంబంధించి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అధునాతన పరికరాల ఏర్పాటుకు తగినట్టు గదులు, ల్యాబ్లు, ఇతర నిర్మాణాలు ఉండాలని ఇంజినీరింగ్ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఆస్పత్రి నిర్మాణ పనులతో పాటు స్థానికులకు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఆస్పత్రి నిర్మాణ పనుల వేగవంతానికి వైద్యారోగ్య శాఖ, పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రతి పది రోజులకోసారి సమావేశమై ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటూ వేగంగా పనులు జరిగేలా చూడాలని సూచించారు. ఆస్పత్రి నిర్మాణం పూర్తయ్యాక అక్కడి బందోబస్తు, ట్రాఫిక్ విధుల నిర్వహణకు సంబంధించి ముందుస్తుగానే తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు శాఖ ఉన్నతాధికారులకు సూచించారు.
ఆస్పత్రికి వివిధ రహదారులను అనుసంధానించే ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించాలని ఆర్ అండ్ బీ అధికారులను కోరారు. హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆస్పత్రులు, మెడికల్ కళాశాలల నిర్మాణానికి సంబంధించి ప్రతి నిర్మాణానికి ఒక అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిర్మాణాలపై నిరంతరాయంగా ఆ అధికారి పర్యవేక్షించేలా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించాలని ఆయన సూచించారు. వచ్చే జూన్ నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సమీక్షలో సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీలు వి.శేషాద్రి, శ్రీనివాసరాజు, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, డీజీపీ శివధర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు వికాస్రాజ్, క్రిస్టియానా చొంగ్తూ, ఇలంబర్తి, ముషారప్ అలీ ఫరూఖీ, హరిచందన తదితరులు పాల్గొన్నారు.