మొదట్లోనే ఉన్న క్యూలైన్ల ఐజి షెడ్ల పనులు
పిల్లర్ల స్థాయిలోనే మగ్గుతున్న పనులు
పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ – తాడ్వాయి : మేడారంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని ఉద్దేశంతో స్థానిక మంత్రి సీతక్క చొరవతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే సంవత్సరం ముందుగానే భక్తులకు నీడ కోసం శాశ్వతంగా క్యూలైన్ల పై జీఐ షీట్స్ పనులు రూ.3.80 కోట్లతో పనులు సాంక్షన్ అయ్యాయి. పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ శాఖకు ఈ పనులు అప్పగించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగు మహా జాతరకు క్యూలైన్ల షెడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఉంది. కానీ సంబంధిత పిఆర్ శాఖ అధికారులు, మంజూరి సుమారు సంవత్సరం కావస్తున్న, సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు ముమ్మరంగా సాగకుండా, నత్తనడకన కొనసాగిస్తున్నారు. పనుల్లో వేగం పెంచాల్సి ఉండగా, పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం పిల్లర్ల స్థాయిలోనే పనులు సాగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పొక్కలో నీరు నిండిపోయింది.
మహా జాతరకు క్యూలైన్లను అందించాలి : మేడారం వచ్చే భక్తులకు శాశ్వత సౌకర్యార్థం ఎండ, వాన, నీడ కోసం క్యూలైన్లపై ఐజి షీట్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచితేనే ఇక్కడికి వచ్చే భక్తులకు సేవలు అందుతాయి. లేదంటే అరకొర సౌకర్యాలతో భక్తులు ఇబ్బంది పడతారు. సంబంధిత అధికారులు, స్పందించి వెంటనే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని పనులు ముమ్మరంగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలని, స్థానిక పూజారులు, భక్తులు కోరుతున్నారు. మహా జాతర ఇంకా సుమారు 7 నెలలు మాత్రమే ఉంది. డిసెంబర్ నుండి మేడారానికి భక్తులకు తాకిడి మొదలవుతుంది. ఈ ఆరేడు నెలలోనే పనులు పూర్తి చేస్తే డిసెంబర్ నెల వరకు భక్తులకు అందుబాటులోకి వస్తాయి. ఇంకా ఆలస్యం అయితే భక్తులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, లేదా కలెక్టర్ స్పందించి క్యూ లైన్ పనులు నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పూర్తీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పూజారులు, భక్తులు కోరుకుంటున్నారు.