మణిపూర్ ప్రజలను కోరిన రాష్ట్రపతి ముర్ము
ఇంఫాల్ : శాంతి, సయోధ్య, సామ రస్యత, అవగాహనలతో కలిసి మెలిసి జీవించడానికి జరిగే ప్రయ త్నాలకు మద్దతునివ్వాల్సిందిగా మణిపూర్లోని అన్ని కమ్యూనిటీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, ప్రగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి వుందని చెప్పారు.సేనాపతి జిల్లాలో ఒక రిసెప్షన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, గిరిజన వార సత్వానికి, సంస్కృతికి గర్వకారణ మైన ఈ జిల్లాలో పర్యటించడం తనకెంతో సంతోషంగా వుందన్నారు. సానుకూల సామాజిక మార్పును తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ప్రధాన మహిళా స్వరమైన నుపీ లాల్ స్మారక దినోత్సవాన్ని ఈరోజు దేశం జరుపుకుంటోందని ఆమె పేర్కొన్నారు. అధిక సంఖ్యలో గిరిజన కమ్యూనిటీలు కలిగిన సుసంపన్నమైన సాంస్కృతిక వైవిధ్యం కలిగిన రాష్ట్రం మణిపూర్ అని ఆమె కొనియాడారు. సేనాపతి జిల్లాల్లో ఈ వైవిధ్యత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అన్ని కమ్యూనిటీల మధ్య శాంతి, సయోధ్యలు, సామరస్యత, అవగాహనలు నెలకొనాలని, ఇందుకు గానూ జరిగే కృషికి అందరూ తోడ్పడాలని రాష్ట్రపతి పేర్కొన్నారు.
శాంతి కోసం ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న తపనను ప్రభుత్వం అర్ధం చేసుకుందన్నారు. ఆ దిశగానే చర్యలు తీసుకుంటోందన్నారు. పలు ప్రాజెక్టులకు ఆమె శంకుస్థాపన చేశారు. అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. శాంతియుత, సంపద్వంత మణిపూర్ కోసం మనందరం కలిసి కృషి చేద్దామని చెప్పారు. తఫూ నాగ గ్రామంలో ఒక రిసెప్షన్కు తాను హాజరయ్యానని, గిరిజన ప్రతినిధులు తనకు సాదరంగా స్వాగతం పలికారని, నిర్వాసితులతో కూడా భేటీ అయ్యానని ఆమె చెప్పారు. మరమ్ గిరిజన తెగ చాలా ప్రత్యేకమైనదని, చాలా దుర్బలమైనదని ఇది దేశ గిరిజన వైవిధ్యతకు ఎంతో దోహదం చేస్తోందని వ్యాఖ్యానించారు. మణిపూర్లోని గిరిజన కమ్యూనిటీలు అభివృద్ధి చెందడం, వారికి అపారంగా అవకాశాలు కల్పించడం వల్ల దేశ పురోగతిలో వారికి కూడా బృహత్తర పాత్రను కల్పించినట్లవుతుందని, అది జాతీయ స్థాయిలో ప్రాధాన్యత గల అంశమని చెప్పారు. వారి అభివృద్ధి కోసం స్థానిక నేతలు, పౌర సమాజాలు, కమ్యూనిటీలతో ప్రభుత్వం కలిసి పనిచేస్తోందన్నారు. దేశ అభివృద్ధి ప్రతి మారుమూలకు వెళ్ళేలా ప్రభుత్వం చూస్తోందన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి పెడుతోందన్నారు.
శాంతి, సయోధ్యకు సహకరించండి
- Advertisement -
- Advertisement -



