Sunday, June 29, 2025
E-PAPER
Homeఎడిట్ పేజికోవిడ్‌ JN..1 వేరియంట్‌ - భయాలు- వాస్తవాలు

కోవిడ్‌ JN..1 వేరియంట్‌ – భయాలు- వాస్తవాలు

- Advertisement -


కోవిడ్‌-19 మరోసారి వార్తల్లోకెక్కింది. తాజా కోవిడ్‌ వైరస్‌ JN..1 వేరియంట్‌ గురించి ప్రజలను గందరగోళపరిచే కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ నేపధ్యంలో కోవిడ్‌-19 వైరస్‌ యొక్క కొత్త వేరియంట్‌ జీచీ.1 గురించీ, దాని ప్రభావం గురించీ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (Ministry of Health & Family Welfare) లెక్కల ప్రకారం మన దేశంలో ప్రస్తుతం (జూన్‌ 5, 2025 నాటికి) దాదాపు 5,000 యాక్టివ్‌ కోవిడ్‌ కేసులు (JN.1 stratin) ఉన్నాయి. మన దేశంలో 2025 జనవరి 1 నుండి జూన్‌ 5, 2025 మధ్య సమయంలో సుమారు 44 మంది మరణించినట్టు తెలుస్తోంది.
JN..1 సబ్‌-వేరియంట్‌ పుట్టుక
2019 డిసెంబర్‌లో తొలిసారి కోవిడ్‌-19 గుర్తించబడింది. వైరస్‌ తన ఉనికి, విస్తరణ కోసం నిరంతరం తన నిర్మాణంలో మార్పులు చేసుకుంటుంది. ఈ మార్పులనే మ్యుటేషన్స్‌ అంటాం. ఫలితంగా కొత్త వేరియంట్స్‌.. ఉదాహరణకు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఒమిక్రాన్‌ వంటి వేరియంట్స్‌ ఉద్భవించాయి. ఈ క్రమంలో ఏర్పడ్డ ఒమిక్రాన్‌ వేరియంట్‌ యొక్క సబ్‌-వేరియంట్‌ రూపమే నేటి JN..1 వైరస్‌. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కోవిడ్‌ వైరస్‌ మానవ శరీరంలోని కణాలకు అతుక్కోడానికి ఉపయోగించే స్పైక్‌ ప్రొటీన్‌లో చోటు చేసుకున్న ఒక అదనపు మార్పు (మ్యుటేషన్‌) ఫలితంగా JN..1 సబ్‌-వేరియంట్‌ ఏర్పడింది.
JN..1 వేరియంట్‌ వ్యాధి లక్షణాలు – తీవ్రమైనవా?
JN..1 సబ్‌వేరియంట్‌లో జరిగిన మ్యుటేషన్స్‌ ఫలితంగా మునుపటి కొన్ని వేరియంట్‌ల కంటే ఎక్కువగా విస్తరించే స్వభావం కల్గివున్నప్పటికీ వ్యాధి లక్షణాలు కొద్దిపాటిగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలలో గుర్తించబడ్డ JN..1 రోగుల డేటా అధ్యయన ఫలితాలను బట్టి కొన్ని ముఖ్య విషయాలు వెల్లడయ్యాయి. కోవిడ్‌ JN..1 సబ్‌-వేరియంట్‌ వ్యాధి లక్షణాలు కనబడ్డ వారిలో డెబ్భై శాతం మంది మధుమేహ (డయాబెటిస్‌) రోగులు, అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్‌) రోగులు, వద్ధులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో కూడా కొద్దిపాటు వ్యాధి లక్షణాలు కనబడ్డప్పటికీ వ్యాధి తీవ్రంగా పరిణమించడం, హాస్పిటల్‌ అడ్మిషన్‌ శాతం తక్కువగానే ఉంది. వ్యాధి లక్షణాల్లో జ్వరం, దగ్గు, జలుబు (ముక్కు కారడం), గొంతునొప్పి, అలసట వంటివి సాధారణంగా ఉంటున్నాయి. కొద్ది మందిలో కండరాల నొప్పులు, ఆయాసం వంటి లక్షణాలు కనబడ్డాయి. మరికొద్ది మందిలో వాంతులు, విరేచనాలు వంటి జీర్ణాశయ సమస్యలు కూడా కనబడుతున్నాయి. గత వేరియంట్స్‌లో కనబడ్డ రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు JN..1 కేసులలో తక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది. హాస్పిటల్లో అడ్మిషన్‌ అవసరమైన కేసుల శాతం తక్కువగానే ఉంటున్నది.
JN..1 వేరియంట్‌ వైరస్‌ పట్ల ఏ వ్యక్తులు ప్రత్యేక అప్రమత్తత కల్గి ఉండాలి?
ఈ వేరియంట్‌ ఎంత వేగంగా విస్తరించగల్గినప్పటికీ, ప్రధానంగా రోగనిరోధక శక్తి సన్నగిల్లిన వ్యక్తుల్లో మాత్రమే వ్యాధి లక్షణాలను కనబరుస్తుంది. మధుమేహం నియంత్రణలో లేని వ్యక్తులు, బీపీ నియంత్రణలో లేని వ్యక్తులు, వద్ధులు, కేన్సర్‌ చికిత్స పొందుతున్న వారు మరింత అప్రమత్తతో రోగ నివారణ చర్యలు పాటించాలి. గుండెజబ్బు, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు కూడా అప్రమత్తంగా ఉండటం మంచిది.
వైరస్‌ యొక్క జీనోమ్‌లో కల్గిన మ్యుటేషన్స్‌ (మార్పులు) ఫలితంగా కొత్త నిర్మాణంతో ఏర్పడ్డ JN..1 వేరియంట్‌ , ఇప్పటికే ప్రజలలో ఉన్న రోగనిరోధక రక్షణని (గత వ్యాక్సిన్స్‌ వలన, గత వ్యాధి సంక్రమణ వలన) తప్పించుకుని (immune escape), ఏ మేరకు వ్యాధి తీవ్రతను కలుగజేస్తుందనేది రానున్న కాలంలో పరిశీలించాల్సి వుంటుంది. ఇప్పటివరకూ దేశంలో నమోదైన కేసులు పరిశీలిస్తే ఈ వేరియంట్‌ పరిణామం కొద్దిపాటి వ్యాధి లక్షణాలతోనే ముగిసేటట్లు కనబడుతోంది.
రోగ నివారణ
గతంలో తీసుకున్న కోవిడ్‌ వ్యాక్సిన్ల వల్ల ప్రజలలో ఉన్న రోగనిరోధకశక్తి (cross-immunity) కొంతమేరకు JN..1 వ్యాధి నియంత్రణకు దోహదం చేస్తుంది.
గతంలో సహజసిద్ధంగా కోవిడ్‌ వ్యాధికి గురికావడం వల్ల ప్రజలలో ఏర్పడ్డ గుంపు రోగనిరోధకత (herd immunity) వలన కూడా కొంతమేరకు JN..1 వేరియంట్‌ వేగంగా ప్రబలడం నివారించబడుతుంది.
PMS (Physical Distance, Mask, Sanitation%) సూత్రం ఇప్పటికీ శిరోధార్యం. కనీస దూరం, మాస్కు ధరించడం, చేతులు మరియు పరిసరాల పరిశుభ్రత పాటించడం తప్పనిసరి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోటికి, ముక్కుకు దస్తీ అడ్డంగా పెట్టుకోవాలి.
ఫంక్షన్స్‌, మాల్స్‌ వంటి జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు హైరిస్క్‌ వ్యక్తులు (పైన తెల్పిన కేటగిరీలు) దూరంగా ఉండటం మంచిది. చిన్నపిల్లలు, వద్ధులు, గర్భిణీస్త్రీలు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం, రోగ లక్షణాలున్న వారికి కనీస దూరం పాటించడం మంచిది.
అనుమానించదగ్గ వ్యాధి లక్షణాలు కనబడ్డ వెంటనే తగిన వైద్య సలహా తీసుకుని, అవసరమైన మందులు, విశ్రాంతి తీసుకోవడం, సెల్ఫ్‌ ఐసోలేషన్‌ పాటించడం శ్రేయస్కరం.
గతంలో మనం చూశాం. కోవిడ్‌ వ్యాధి వలన కల్గిన మరణాల కంటే, ఆ వ్యాధి పట్ల అవగాహన లేమితో కల్గిన భయాందోళనల వల్ల, సామాజిక బాధ్యత లేకుండా వ్యాప్తి చేసిన తప్పుడు సమాచారం ఫలితంగా ఎక్కువ మరణాలు సంభవించడం మనం చూశాం. ‘దున్నపోతు ఈనిందంటే – దూడను కట్టేయండి’ అన్న చందంగా లాభాపేక్ష ధ్యేయంగా కల్గిన కొన్ని మందుల పరిశ్రమలు, కొన్ని బాధ్యతారాహిత్య మీడియా సంస్థలు సష్టించే అహేతుకమైన గందరగోళానికి ప్రజానీకం గురికాకూడదు. ప్రస్తుత తరుణంలో కొత్త వేరియంట్‌ గురించి సరైన అవగాహననూ, నివారణ చర్యలనూ ప్రజలలోకి తీసుకుపోయేందుకు ప్రభుత్వం, పౌరసంఘాలు మరియు ప్రజారోగ్య పక్షపాతులందరూ కషి చేయాల్సి వుంది.
డా.కె.శివబాబు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -