నవతెలంగాణ – కంఠేశ్వర్
చైనా మాంజా వలన ఎవరైనా వ్యక్తులకు ప్రాణహాని కలిగితే వారిపై హత్యా నేరం క్రింద కేసు నమోదు చేస్తామని, చైనా మాంజా తయారీదారులకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్ హెచ్చరిక జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలోని ప్రజలకు చైనా మాంజ వాడకం వలన ప్రజలకు, జంతువులకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉన్నది. ఈ చైనా మాంజా వలన ఎవరైనా వ్యక్తులకు ప్రాణహాని కలిగితే వారిపై హత్య నేరము క్రింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. కావున ఎవరైనా చైనా మాంజా నిలువ ఉంచిన, ఎవరైనా చైనా మాంజ తయారు చేసిన, ఎవరైనా చైనా మాంజా అమ్మిన లేదా అమ్మడానికి ఎవరైనా ప్రోత్సహించిన వారిపై చట్ట ప్రకారము చర్యలు తీసుకొనబడును.
కావున కొంతమంది ఇప్పటికే హైదరాబాదు నుండి నిజామాబాదుకు చైనా మాంజా తరలించినట్లు పోలీసులకు సమాచారం ఉన్నది. అట్టి చైనా మాంజా సంబంధిత పోలీస్ స్టేషన్ యందు అప్పగించగలరు లేదా కాల్చి వేయగలరు. ఎవరైనా బయటపడేసినట్లయితే ప్రజలకు మరియు జంతువులకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉన్నది . ఎవరైనా ఇట్టి చైనా మాంజా విక్రయించిన , అట్టి మాంజాతో ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే విక్రయ దారులు కూడా అట్టి కేసుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
కాబట్టి పైన తెలియజేయబడినటువంటి సూచనలకు విరుద్ధంగా ఎవరైనా చైనా మాంజా నిలువ చేసిన , అమ్మిన వారిపై చట్ట ప్రకారము చర్యలు తీసుకొనబడును. ఎవరి వద్దనైనా అట్టి చైనా మాంజా ఉన్నట్లయితే వారు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ యందు అప్పగించ గలరు. లేనియెడల చైనా మాంజా ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు సమాచారం తెలిసినట్లయితే తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్ నందు తెలియజేయగలరు లేదా డయల్ 100 కు కాల్ చేయగలరు. సమాచారం ఇచ్చినటువంటి వారి వివరాలు గోప్యముగా ఉంచుతామన్నారు.



