నవతెలంగాణ సూర్యాపేట: సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్య చారి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర ఘటన చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి సూర్యాపేటలో నివాసముండే తన కూతురు వద్ద రాత్రి హల్ట్ చేసిన అయోధ్య చారి బుధవారం ఉదయం కారులో హైదరాబాద్కు బయలుదేరారు. అయితే సూర్యాపేట పట్టణంలోని యస్వీ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న ధర్మభిక్షం విగ్రహం వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది.
విజయవాడ నుండి హైదరాబాద్కు వెళుతున్న ఓ భారీ లారీ, అయోధ్య చారి ప్రయాణిస్తున్న కారును వెనుకనుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
సిపిఐ శ్రేణులు అయోధ్య చారి మరణంతో దిగ్భ్రాంతికి లోనయ్యాయి. పార్టీ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకొని ఆయనకు ఘన నివాళులర్పించారు.