పన్ను చెల్లిస్తున్న ఆశావహులు..
నవతెలంగాణ – మల్హర్ రావు
పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని గ్రామపంచాయతీలకు కాసుల పంట పండుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటి పన్ను, నల్లా బిల్లులు చెల్లించి ఉండాల్సిందేననే నిబంధనతో ఆశావహులు చెల్లింపులు చేస్తున్నారు. మండలంలో 15 గ్రామపం చాయతీలు,128 వార్డులు ఉన్నాయి.మండలంలో మూడో విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఎన్నికల బరిలో పెద్దసంఖ్యలో ఉండడంతో ఇంటిపన్నులు,నీటి పన్నులు వసూలవుతున్నాయి.
మార్చికి మూడు నెలలు ముందే బకాయిలు వసూలవుతున్న క్రమంలో గ్రామ పంచాయతీలకు ఆర్థిక సమస్యలను అధిగమించడానికి వసూళ్లకు కారోబార్లు, కార్యదర్శులు అందుబాటులో ఉంటున్నారు. జీపీలకు పెద్ద మొత్తంలో ఆదాయం రావడంతో సిబ్బంది వేతనాలతోపాటు వివిధ అభివృద్ధి పనులకు వెచ్చయించవచ్చని అధికారులు సూచిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల పుణ్యమా అని తమకు నెలల తరబడి పెండింగ్లో ఉన్న వేతనాల చెల్లింపు జరుగుతోందని జీపీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.15 గ్రామాల్లో ఇప్పటి వరకు రూ.2లక్షకు పైగా ఇంటి, నల్లా పన్నులు వసూలైనట్లుగా తెలుస్తోంది.



