– క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించాలి
– పంట నష్టంపై తప్పుడు నివేదికను అందజేస్తే చర్యలు తప్పవు
– జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి అంబికా సోని
నవతెలంగాణ–పాలకుర్తి
మొంథా తుఫానుతో ఇటీవలే కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన పంటల వివరాలను త్రితగతిన పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అందించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి కట్ట అంబికా సోని ఏఈఓ లను ఆదేశించారు. ఆదివారం మండలంలోని లక్ష్మీనారాయణపురం, గూడూరు గ్రామాలను వ్యవసాయ శాఖ పాలకుర్తి డివిజన్ ఉపసంచాలకులు అజ్మీర పరశురాం నాయక్ తో కలిసి నష్టపోయిన పంటలను పరిశీలించారు.

పాలకుర్తి, విసునూరు, బమ్మెర గ్రామాల్లో మండల వ్యవసాయ శాఖ అధికారి సింగారపు రమేష్ క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి అంబికా సోని మాట్లాడుతూ భారీ వర్షానికి నష్టపోయిన రైతుల వివరాల ను సేకరించి నష్టపోయిన రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేయాలని తెలిపారు. పారదర్శకంగా క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంటలను గుర్తించాలి తప్ప ఇతరులు ఇచ్చిన సమాచారాన్ని తీసుకోరాదని సూచించారు.
వర్షానికి పాలకుర్తి మండలంలో 6200 ఎకరాల్లో పంట నష్టపోయిందని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రాథమిక అంచనా వివరాలను అందించిందని తెలిపారు. పంట నష్టం వివరాల్లో మరింత పెరగవచ్చని తెలిపారు. పంట నష్టం సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఏఈఓ లను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు జాటోతు రాధిక, ముత్తినేని వెంకటేష్, మాన్యపు దీపక్, కల్వల సువర్ణ లతోపాటు రైతులు పాల్గొన్నారు.



