నవతెలంగాణ-హైదరాబాద్: ఏపీలో మొంథా తుపాన్ బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మొంథా ప్రభావం తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ తీరంలో ఇప్పటికే సముద్ర కెరటాలు ఎగసిపడుతున్నాయి. కాకినాడ, యానాం తీర ప్రాంతాలకు ఉప్పెన ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు తుపాన్ అధిక తీవ్రత గల ప్రాంతాల్లో అగ్నిమాపక, విద్యుత్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు.
ఈక్రమంలోనే వాతావారణ శాఖ మొంథా తుపాన్పై కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం విశాఖకు దక్షిణంగా 230 కి.మీ, కాకినాడకు ఆగ్నేయంగా 130 కి.మీ, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 50 కి.మీ దూరంలో మొంథా కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఇవాళ రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముంది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.



