అది డెమొక్రాట్ల గొంతుక అంటూ ట్రంప్ ఆరోపణ
వాషింగ్టన్ : అమెరికా వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్పై ఫ్లోరిడా రాష్ట్రంలో పదిహేను బిలియన్ డాలర్ల మేరకు పరువు నష్టం దావా వేస్తున్నానని దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. ‘న్యూయార్క్ టైమ్స్ పత్రిక నన్ను దూషించింది. నాపై అపవాదు వేసింది. అందుకే ఆ పత్రికపై పరువు నష్టం దావా వేస్తున్నాను. మా దేశ చరిత్రలో అత్యంత చెత్త, దిగజారిపోయిన పత్రికలలో అది ఒకటి. అది డెమొక్రాట్ పార్టీకి గొంతుకలా మారింది’ అని ఆయన మండిపడ్డారు. అయితే ఇతర వివరాలేవీ ఆయన తెలియజేయలేదు. ఫ్లోరిడాలో దావా వేస్తానని మాత్రం చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ తన గురించి, తన వ్యాపారం గురించి, కుటుంబ సభ్యుల గురించి అబద్ధాలు ప్రచారం చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. రిపబ్లికన్ల నేతృత్వంలో జరుగుతున్న ఉద్యమాలు, అమెరికా ఫస్ట్ మూవ్మెంట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా) వంటి భావజాలాలకు వ్యతిరేకంగా అబద్ధాలు వల్లె వేస్తోందని ధ్వజమెత్తారు. కాగా ట్రంప్ వ్యాఖ్యలపై న్యూయార్క్ టైమ్స్ నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు.
న్యూయార్క్ టైమ్స్ చాలా కాలంగా తనపై యధేచ్ఛగా అబద్ధాలు ప్రచారం చేస్తోందని, తన పరువుకు నష్టం కలిగిస్తోందని, తనపై బురద చల్లుతోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులోనే చనిపోయిన జెఫ్రీ ఎప్స్టెయిన్ ఉదంతానికి సంబంధించి నూయార్క్ టైమ్స్పై దావా వేస్తానని ట్రంప్ గత వారమే హెచ్చరించారు. ‘అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసిన డెమొక్రాట్ కమలా హారిస్ను సమర్ధిస్తూ న్యూయార్క్ టైమ్స్ తన మొదటి పేజీలో ఓ వార్తను ందించింది. అంతకుముందు ఎవరూ వినని విషయం. నన్ను, నా కుటుంబాన్ని, వ్యాపారాన్ని, అమెరికా ఫస్ట్ మూవ్మెంట్ను, మాగాను… మొత్తంగా మన దేశాన్ని గురించి చాలా కాలంగా అబద్ధాలు చెబుతోంది’ అని ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ రాసుకొచ్చారు.