Tuesday, June 3, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ప్రమాదంలో ప్రజాస్వామ్యం

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

- Advertisement -

మావోయిస్టులు చర్చలంటుంటే..
కాల్చి చంపుతానని కేంద్రం అంటోంది : ప్రొఫెసర్‌ హరగోపాల్‌
పూర్వ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో ”సాయుధ విప్లవ పోరాటం-
శాంతి చర్చలు” పై సదస్సు
నవతెలంగాణ – ముషీరాబాద్‌

ఓ పక్క మావోయిస్టులు చర్చలు అంటుంటే.. వారిని చంపి తీరుతా అని మరో పక్క కేంద్ర ప్రభుత్వం మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోందని, ప్రజాస్వామ్యం పూర్తిస్థాయిలో ప్రమాదంలో పడిందని ప్రొఫెసర్‌ జి. హరగోపాల్‌ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పూర్వ విద్యార్థి వేదిక నాయకులు ఎన్‌.రవి ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌యూ వ్యవస్థాపక సభ్యులు, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు స్మృతిలో ”సాయుధ విప్లవ పోరాటం-శాంతి చర్చలు” సదస్సు నిర్వహించారు. ముందుగా ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నంబాళ్ల కేశవరావుతో సహా ఇతరులందరికీ నివాళులు అర్పించారు. అనంతరం ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ.. కొంతకాలంగా పాలకులు అనుసరిస్తున్న విధానాలతో దేశం ఒక విచిత్రమైన సంక్షోభంలోకి పడిపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు.. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతుంటే.. ప్రభుత్వం అణిచివేతను నమ్ముకుంటున్నదని తెలిపారు. దండకారణ్యం నెత్తురోడుతోందని, విప్లవోద్యమం అణిచివేతే లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్‌ కగార్‌ ఆదివాసీ హననానికి కారణం అవుతున్నదని అన్నారు. కార్పొరేట్‌ దోపిడీని వ్యతిరేకిస్తున్న ఆదివాసీ సమాజానికి అండగా ఉన్న విప్లవోద్యమాన్ని నిర్మూలించడం ద్వారానే పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడగలమన్న భావనతో మోడీ ప్రభుత్వం దేశ ప్రజలపై యుద్ధం చేస్తున్నదని చెప్పారు. ఈ మారణ హౌమానికి అర్థవంతమైన పరిష్కారం వెతకాలనే ఉద్దేశంతో శాంతి చర్చలు జరపాలని ప్రజాస్వామిక వాదులు ప్రతిపాదనను ముందుకు తెచ్చారని తెలిపారు. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతున్నా ఖాతరు చేయని కేంద్ర ప్రభుత్వం యుద్ధ బీభత్సాన్ని సృష్టిస్తున్నదన్నారు.
వీక్షణం సంపాదకులు వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ఒకవైపు విప్లవ పార్టీ చర్చలకు సిద్ధమని, కాల్పుల విరమణ పాటిస్తామని ప్రకటించినా ప్రభుత్వం మాత్రం తుపాకీతోనే పరిష్కరిస్తామనడం అమానవీయం అన్నారు. ఇది మావోయిస్టుల సమస్య కాదని, ఆదివాసులదీ, ప్రజలదని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో సంపదను.. కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం ఆదివాసులకు అండగా నిలబడుతున్న మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం ప్రకటించడం రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాయడమేనని అన్నారు. భారత్‌ బచావో నాయకులు డాక్టర్‌ గోపీనాథ్‌ మాట్లాడుతూ.. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో జరుగు తున్న విధ్వంసాన్ని అడ్డుకునేందుకు మావోయిస్టు లతో కేంద్ర ప్రభుత్వం, చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం చర్చలు జరపాలని కోరారు. లక్షలాదిమంది భద్రతా బలగాలను మోహరించి వాయుసేనకు చెందిన హెలికాఫ్టర్లు డ్రోన్లు, బాంబు లతో ఆదివాసీలపై అంతర్యుద్ధాన్ని చేస్తున్నాయని, అంతర్యుద్ధం ప్రకటిస్తే అంతర్జాతీయ న్యాయ సూత్రాలను పాటించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఎంఎఫ్‌ గోపినాథ్‌, విరసం నాయకులు పాణి, సీఎల్‌సీ నాయకులు లక్ష్మణ్‌తో పాటు ఆత్రం భుజంగరావు, బురం అభినవ్‌, ప్రజా సంఘాల నాయకులు, విప్లవ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -